బ్రౌన్‌షుగర్ పట్టివేత | Capture braunsugar | Sakshi
Sakshi News home page

బ్రౌన్‌షుగర్ పట్టివేత

Aug 11 2013 1:18 AM | Updated on Sep 17 2018 6:20 PM

బ్రౌన్‌షుగర్ (మత్తు పదార్థం) విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ యువకుడిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

యాకుత్‌పురా, న్యూస్‌లైన్: బ్రౌన్‌షుగర్ (మత్తు పదార్థం) విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ యువకుడిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచిరూ. 3 లక్ష ల విలువ చేసే 100 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ బి. లింబారెడ్డి, దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సూర్యప్రకాశ్‌రావుతో కలిసి శనివారం తెలిపిన

వివరాల ప్రకారం.. బీహార్‌లోని రఘునాథ్‌పూర్‌కు చెందిన మహ్మద్ సిరాజ్  కుత్బుల్లాపూర్‌లో ఉంటూ పాతబస్తీ జహంగీరాబాద్‌లోని ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. గతనెలలో అతను ఢిల్లీ వెళ్తుండగా రైల్లో ఢిల్లీ సదర్‌బజార్ మార్కెట్‌కు చెందిన ఇందర్ పరిచయమయ్యాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు అతనితో కలిసి సిరాజ్ సదర్‌బజార్ మార్కెట్‌లో 100 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను రూ. 50 వేలకు కొనుగోలు చేసి నగరానికి తెచ్చాడు. దాన్ని ఒక గ్రాము, ఐదు గ్రాముల ప్యాకెట్లు కింద చేశాడు. గ్రాము ప్యాకెట్‌ను రూ. 3 వేలుకు, ఐదు గ్రాముల ప్యాకెట్‌ను రూ.15 వేలు చొప్పున విక్రయించేందుకు సిద్ధమయ్యాడు.  

దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సూర్యప్రకాశ్ పర్యవేక్షణలో ఎస్సైలు మధు, గౌస్, సిబ్బంది శనివారం ఉదయం కందికల్‌గేట్ దుర్దానా హోటల్ వద్ద మహ్మద్ సిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ. 3 లక్షల విలువ చేసి బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు.  సిరాజ్‌పై ఎన్‌డీపీఎల్ యాక్ట్ సెక్షన్ 20 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.  ఢిల్లీకి చెందిన ఇందర్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రౌన్ షుగర్‌ను యువత సిగరెట్‌లో నింపి సేవిస్తూ మత్తులో తూగుతుంటారని పోలీసులు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement