అతి సమీపం నుంచి కాల్చారు.. | Sakshi
Sakshi News home page

అతి సమీపం నుంచి కాల్చారు..

Published Mon, Nov 2 2015 1:19 PM

అతి సమీపం నుంచి కాల్చారు.. - Sakshi

అది వనస్థలిపురం ఆటోనగర్ లోని సుష్మా సాయినగర్. సోమవారం ఉదయం. ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు బైక్ పై వెళుతూ రోడ్డుపై నడిచి వెళుతున్న అనూరాధ అనే మహిళ మెడలో గొలుసును లాగే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ రోడ్డుకు ఇరువైపులా ఇద్దరు యాంటీ చైన్ స్నాచింగ్ వింగ్ పోలీసులు మాటు వేశారు. మహిళ మెడపై చెయ్యివేసిన మరుక్షణం అప్రమత్తమైన పోలీసుల్లో ఒకరు దుండగులను పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు.

అయితే, రోడ్డుకు అటువైపున్న మరో బృందం పోలీసులు.. నడుము వెనుక భాగంలో ఉన్న తుపాకిని తీసి, అతి సమీపం నుంచి స్నాచర్లపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా కాల్పుల నుంచి తప్పించుకున్న దుండగులు బైక్ వేగం పెంచి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కూడా వారిని వెంటాడారు. కానీ దుండగులు తెలివిగా తప్పించుకున్నారు.

 

సంఘటన జరిగిన ప్రదేశంలోని ఓ షాపులో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. కాగా, దుండగుల్లో ఒకరు కచ్చితంగా గాయపడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వనస్థలిపురంలో కాల్పుల సంఘటన హైదరాబాద్ నగరవ్యాప్తంగా కలకలం రేపింది. ఇదిలా ఉండగానే అల్వాల్ ప్రాంతంలో ఒక మహిళ మెడలో బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు.

Advertisement
Advertisement