
ఏపీ మంత్రులది అజ్ఞానం
‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్)’ అనే పథకానికి మాత్రమే స్థానికతను నిర్ధారించేందుకు ‘1956’ ఏడాదిని కటాఫ్గా పరిగణనలోకి తీసుకుంటామని, దాని ఆధారంగానే ఫీజులను చెల్లిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి తెలిపారు.
1956 కటాఫ్ ‘ఫాస్ట్’ పథకానికే పరిమితం: విద్యామంత్రి జగదీశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్)’ అనే పథకానికి మాత్రమే స్థానికతను నిర్ధారించేందుకు ‘1956’ ఏడాదిని కటాఫ్గా పరిగణనలోకి తీసుకుంటామని, దాని ఆధారంగానే ఫీజులను చెల్లిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి తెలిపారు. దీనిపై మార్గదర్శకాల రూపకల్పనకు ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించామని వెల్లడించారు.
ఆ కమిటీ రూపొందించే మార్గదర్శకాలతో త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పారు. గురువారం సచివాలయంలో మంత్రి జగదీశ్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాల్లోనూ స్థానికత నిర్ధారణకు ఈ కటాఫ్ను ప్రాతిపదికగా తీసుకుంటారేమోనని ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెబుతున్నారని ప్రశ్నించగా... ‘ఫాస్ట్’ పథకానికి మాత్రమే దానిని వర్తింపజేస్తామని చెప్పారు.
సినిమాల్లోలాగా కథలు చెప్పడం ఏపీ మంత్రులకు అలవాటని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా ఇంకా ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. ‘‘చంద్రబాబుకు కేసీఆర్తో పోటీయా? ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలను నిలబెట్టుకునేందుకు కేసీఆర్ కేబినెట్లోనూ తీర్మానం చేశారు. అదే చంద్రబాబు మాత్రం విమర్శలు, ప్రకటనలు, కోర్టు కేసులు, అవీ ఇవీ అంటూ చిల్లర తగాదాలు పెట్టుకుంటూ.. అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
చేతనైతే ఏపీ ప్రజలకు మంచి పనులు చేయండి.. చేతకాకపోతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేమని చెప్పుకోండి..’’ అని మంత్రి సూచించారు. ఏపీ సీఎం, మంత్రులకు జ్ఞానం ఉన్నట్లు కనిపించడం లేదని... వారు ప్రగల్భాలు, తెలంగాణపై విమర ్శలతో పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. ‘‘అసలు వారు రాజధానిని ఎక్కడ పెట్టుకుంటారో ఇప్పటికీ తేల్చలేదు. ఇక్కడే ఉండి ప్రభుత్వం నడుపుకొంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో బ్రెయిలీ లిపిలో పాఠ్యపుస్తకాలు
భవిష్యత్తులో అంధ విద్యార్థుల కోసం బ్రెయిలీ లిపిలో పాఠ్య పుస్తకాలను ప్రభుత్వపరంగా అందుబాటులోకి తేనున్నట్లు విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తకోట ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న యాదేశ్వరీ.. అంధుల కోసం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పాఠ్య పుస్తకాలను బ్రెయిలీ లిపిలో రూపొందించారు.
ఆ పుస్తకాలను గురువారం సచివాలయంలో మంత్రి జగదీశ్రెడ్డి ఆవిష్కరించారు. అంధుల కోసం ఈ పుస్తకాలను రూపొందించినందుకు ఆమెను అభినందించారు. అన్ని స్కూళ్లకు వీటిని ఉచితంగా అందించేందుకు ఆమె ముందుకు వచ్చారన్నారు. ఈ పుస్తకాల కోసం అంధ పాఠ శాలల ప్రిన్సిపాళ్లు.. ఆమెను సంప్రదించాలని చెప్పారు.