బ్యాంకులపై నమ్మకం పోతోంది! | Banks will not be able to believe! | Sakshi
Sakshi News home page

బ్యాంకులపై నమ్మకం పోతోంది!

Oct 27 2017 2:11 AM | Updated on Mar 25 2019 3:09 PM

Banks will not be able to believe! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ పథకాల కింద 20 శాతం రుణాలను సైతం బ్యాంకులు జారీ చేయడం లేదు. ఆస్తులను తనఖా పెట్టే స్థోమత లేక ఆయా వర్గాల ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించలేకపోతున్నారు. ఈ వైఖరితో బ్యాంకులపై నమ్మకం సన్నగిల్లినందునే రాష్ట్ర ప్రభుత్వం ఆ వర్గాల ప్రజలకు 80–90 శాతం సబ్సిడీతో రుణాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.’’అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

ఇప్పుడు కూడా లబ్ధిదారులకు బ్యాం కులు ఇచ్చే 20 శాతం మార్జిన్‌ మనీలోనూ 10 శాతాన్ని తిరిగి డిపాజిట్‌ చేయాలని కోరుతున్నాయని, అది ఏ మాత్రం మంచిది కాద ని.. వ్యాపారం కాకుండా మానవతా దృక్పథం తో వ్యవహరించాలని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఈటల రాజేందర్‌ మాట్లాడారు.

రైతులు, బ్యాంకుల మధ్య సంబంధా లు తెగిపోవద్దని.. రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి భారీ వడ్డీలతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.  కొందరికి మాత్రమే మేలు చేసే కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ పేదరికానికి దారితీస్తుందని.. ఆర్థిక అంతరాలను తొలగించేందుకు బ్యాంకులు  ఉదారంగా రుణాలు అందించాలని కోరారు.

భవిష్యత్తులో రుణాలవసరముండదు
ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు ప్రాజెక్టులు వస్తే రైతులకు టర్మ్‌ రుణాల అవసరం ఉండదని.. పంట రుణాలు ఇస్తే సరిపోతుందని మంత్రి ఈటల పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు వస్తే రైతులు బోర్లు, బావులు, పైపుల కోసం టర్మ్‌ రుణాలు తీసుకోరని చెప్పారు.  మారిన పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకులు సైతం మారాల్సిన అవసరముందని.. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల ఏర్పాటు కోసం ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు.

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీల అమలు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందుల్లో ఉందని పేర్కొన్నారు. అయితే సొంత పన్నుల రాబడి విషయంలో 21.9 శాతం వృద్ధి రేటుతో తెలంగాణ దేశం లోనే నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు.

వడ్డీ వసూలు చేయొద్దు: పోచారం
ప్రస్తుత రబీలో రైతులకు పంట రుణాలు, టర్మ్‌ రుణాలు, వ్యవసాయ ఆధారిత అవసరాల రుణాల జారీలో కొన్ని బ్యాంకులు చాలా వెనుకబడి ఉన్నాయని వ్యవసాయ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

వాతావరణపరంగా ఈ ఏడాది వ్యవసాయానికి చాలా అనుకూలమని, రబీలో రైతులకు విరివిగా పంటరుణాలు అందించాలని బ్యాంకర్లను కోరారు.  రైతుల నుంచి వడ్డీలు వసూలు చేయవద్దని ఇప్పటికే ఎస్‌ఎల్‌బీసీలో నిర్ణయం తీసుకున్నా కొన్ని బ్యాంకు శాఖలు రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తున్నాయని పేర్కొ న్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.17 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని.. రూ.50 కోట్లో రూ.100 కోట్లో ఉండే వడ్డీ బకాయిల  మొత్తాన్ని సైతం చెల్లించగలుగుతామని చెప్పా రు. 

సమావేశంలో వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు పార్థసారథి, సందీప్‌ సుల్తానియా, ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ ఆర్‌.సు బ్రమణ్యం, ఎస్‌బీఐ సీజీఎం ప్రమోద్‌ పారిక్, నాబార్డు సీజీఎం రాధాకృష్ణ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement