‘చంద్రబాబు ప్రతి అడుగులో మోసమే’ | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ప్రతి అడుగులో మోసమే’

Published Tue, Aug 8 2017 6:09 PM

‘చంద్రబాబు ప్రతి అడుగులో మోసమే’ - Sakshi

నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నందికొట్కూరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. చంద్రబాబు వేసే ప్రతి అడుగులో అవినీతి, మోసమే కనిపిస్తుందని ఆయన విమర్శించారు.  నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ ఎంపీ బుట్టా రేణుకతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్రం మొత్తం నంద్యాల వైపే చూస్తోందని, ఉప ఎన్నికలో గెలవడానికి చంద్రబాబు చేసే అన్యాయాలను నంద్యాల ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

మోసానికి, నమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధమే నంద్యాల ఉపఎన్నిక అన్నారు.  చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చేది మోసమని, అలాంటి వాళ్ల మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఎన్నికలు రాగానే బాబుకు అభివృద్ధి గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడానికి అబద్ధపు హామీలు ఇవ్వడంలో చంద్రబాబు దిట్ట అని, ఎన్నికలు అయిపోగానే హామీలను తుంగలో తొక్కే నైజం చంద్రబాబుకు మాత్రమే సొంతమని విమర్శించారు. నంద్యాల ప్రజలు తమ ఓట్లతో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

ఓట్ల కోసమే నంద్యాలపై సర్కార్‌ ప్రేమ..
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ బుట్టా రేణుక విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే జీవోలు ఇస్తూ నంద్యాలపైన లేనిపోని ప్రేమ ఒలకబోస్తున్నారని ఇది చంద్రబాబు ప్రభుత్వానికి తగదని ప్రజలకు అన్ని విషయాలపైన అవగాహన వుందని ఆమె అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారని నంద్యాల ప్రజలనుంచి వస్తున్న స్పందనే దీనికి నిదర్శనమని బుట్టా రేణుక అన్నారు.

Advertisement
Advertisement