నర్సారావుపేటలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న బహిరంగ సభలో తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చిన నిరుద్యోగులపై టీడీపీ గూండాలు అత్యంత కిరాతకంగా దాడి చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది.
తీవ్రంగా ఖండించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి
హైదరాబాద్: నర్సారావుపేటలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న బహిరంగ సభలో తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చిన నిరుద్యోగులపై టీడీపీ గూండాలు అత్యంత కిరాతకంగా దాడి చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై వెంటనే న్యాయవిచారణ జరిపి దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని పార్టీ అనుబంధ విభాగాల ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు బాబు వస్తేనే జాబు వస్తుందని, ఇంటికో ఉద్యోగం ఇస్తాం... అది వచ్చే వరకూ ప్రతి ఇంటికి రు 2000లు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రచారం చేసి మాట తప్పారని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ విధంగా హామీలిచ్చిన చంద్రబాబు చివరకు దిగజారి పోయి శుక్రవారం ఏకంగా తన సభలోనే, తన కళ్ల ఎదుటే, తన కార్యకర్తలతో ఉద్యోగాలు అడగడమే నేరం అన్నట్లుగా నిరుద్యోగులపై అమానుషంగా దాడులు చేయించారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. నిరుద్యోగులపై దాడి చేయడం, అదీ ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ఆయన ఎదుటే జరగడం చూస్తూంటే ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు, గూండా స్వామ్యం అని నిరూపితం అవుతోందని వ్యాఖ్యానించారు.