కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయడానికి అవకాశం కల్పిస్తున్న జీవో-22ను మరింతగా విస్తరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
* కాంట్రాక్టర్లకు మరింత అదనంగా చెల్లించడానికి వీలుగా ప్రతిపాదనలు
* మరో జీవో తెచ్చేందుకు రంగం సిద్ధం
* రేపు కేబినెట్ ఆమోదించే అవకాశం
* కమీషన్లు దండుకోవడానికేనని నీటిపారుదలశాఖలో చర్చ
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయడానికి అవకాశం కల్పిస్తున్న జీవో-22ను మరింతగా విస్తరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
ఈ జీవో పరిధిలోకి రాని కాంట్రాక్టర్లకు కూడా అదనపు చెల్లింపులు చేయడానికి, జీవో-22 అమలు చేసినా తమకు గిట్టుబాటు కావట్లేదంటూ ప్రభుత్వాన్ని ఆశ్రయించిన అధికారపార్టీ కాంట్రాక్టర్లకు అడిగినంత సొమ్ము దోచిపెట్టడానికి వీలుగా మరో జీవో తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. మరింత అదనంగా చెల్లింపులు చేసి అందుకు అనుగుణంగా కమీషన్లు దండుకోవడానికి ప్రభుత్వ పెద్దలు సమాయత్తమవుతున్నారని నీటిపారుదలశాఖలో చర్చ జరుగుతోంది. జీవో-22 విస్తరణపై బుధవారం రాజమండ్రిలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది.
కేబినెట్లో చర్చించడానికి వీలుగా నీటిపారుదలశాఖ ప్రతిపాదనను సిద్ధం చేసింది. మంత్రివర్గ ఎజెండాలో చేర్చాలంటే.. ఆర్థికశాఖ ఆమోదం తీసుకోవాలనే నిబంధన ఉంది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం కూడా అవసరం. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్తోపాటు, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావులిద్దరూ ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. దీంతో అక్కడే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయించే అవకాశాలను నీటిపారుదలశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎజెండాలో చోటుదక్కితే మంత్రివర్గం ఆమోదిస్తుందని అధికారవర్గాల సమాచారం.