‘నిరసనా, ఒత్తిడి తేవడమా త్వరలో నిర్ణయం’ | Prathipati Pulla Rao Respond on union budget | Sakshi
Sakshi News home page

‘నిరసనా, ఒత్తిడి తేవడమా త్వరలో నిర్ణయం’

Feb 1 2018 7:34 PM | Updated on Aug 18 2018 6:00 PM

Prathipati Pulla Rao Respond on union budget - Sakshi

సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంపై నిరసన తెలపడమా, ఒత్తిడి తేవడమా అనే దానిపై త్వరలో నిర్ణయిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం సాయంత్రం జరిగిన సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగుల జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ముగింపు సభకు హాజరైన మంత్రి కేంద్ర బడ్జెట్‌పై విలేకరుల వద్ద స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

ఏపీకి ఆశించినమేర నిథులు ఇవ్వలేదన్నారు. ఏపీకి 16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ దానిని కేంద్ర బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఏపీలో ప్రధానాంశాలైన పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని, రైల్వేజోన్‌ అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం, ఏపీ విభజన చట్టం అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. సెంట్రల్‌ వర్సిటీలకు 30 కోట్ల చొప్పున కేటాయించినా అవి కూడా పూర్తి స్థాయి కేటాయింపులు కాదన్నారు. కీలక రంగాలైన వ్యవసాయం, పరిశ్రమలకు ఊరట లభించలేదన్నారు. ఏపీకి కేటాయింపులపై మోదీ పునరాలోచించుకోవాలని సూచించారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయంపై ముఖ్యమంత్రి, పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement