మోదీకి ఖేదం– కేసీఆర్‌కు మోదం

Sakshi Guest Columns Story On Five State Assembly Elections Results

2019 సార్వత్రిక ఎన్నికలకు  ముందు  సెమీ ఫైనల్‌గా జరిగిన అయిదు రాష్ట్రాలు–మధ్యప్రదేశ్, రాజ స్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజో రాం ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ హవాకు అడ్డుకట్ట వేశాయని చెప్పవచ్చు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన   రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, మిజోరాంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ ఏక పక్షంగా సాధించిన  విజయాలు చరిత్రాత్మకమైనవి. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి  ఖేదం, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు మోదాన్ని కలిగించాయి. అలాగే  దేశంలో ఇప్పటి వరకూ ముందస్తు ఎన్నికలకు  వెళ్లిన  ఏ రాజ కీయ పార్టీ విజయం సాధించిన దాఖలాలు లేవు.

కాబట్టి ఆ రికార్డును  టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా  టీఆర్‌ఎస్‌ కారు వేగానికి  కాంగ్రెస్‌లోని హేమాహేమీలు అడ్డుకట్ట వేయలేక ఓడిపోవడం గమనార్హం. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వ పథకాలే టీఆర్‌ఎస్‌  భారీ విజయానికి దోహదపడ్డాయి. ఇక   ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలన్న బీజేపీ కలలు కల్లలైనాయి. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఈ ఎన్నికలు మంచి గుణపాఠం నేర్పిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మైనారిటీ వ్యతిరేక రాజకీయాలు, మతం పేరిట ఓటర్లలో విభజన తెచ్చే వ్యూహాలు బీజేపీకి బెడిసికొడుతున్నాయని గ్రహించాలి. కేంద్రంలో అధికారంలోకొస్తే నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, ప్రతీ నిరుపేద కుటుంబానికి పదిహేను లక్షలు వారి ఖాతాలలో జమ చేస్తామన్న హామీలు నీటి మూటలయ్యాయి. నోట్ల రద్దుతో సామాన్యులకు నరకం చూపించారు. బ్యాంకుల దివాలాకు కారణమయ్యారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ, ఆర్థిక విధానాల వల్ల  నిత్యావసరాల ధరలు, పెట్రోలు డీజిల్‌ రేట్లు అమాంతం పెరిగిపోయి సామాన్యుడు  బతకలేని దుస్థితి దాపురించింది. మరోవైపు సంఘ్‌ పరివార్‌ వివాదాలు, విధ్వం సక పోకడలు బీజేపీ ప్రతిష్ఠను, మోదీ హవాను lతగ్గించివేస్తున్నాయి.అందువల్ల ఎన్నికలకు ముందు దేశ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కేంద్రం ఇకనైనా చిత్తశుద్ధితో కృషిచేయాలి. బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్‌ మోపూరు, నెల్లూరుజిల్లా

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top