కరోనా విజేత మానవుడే! 

ABK Prasad Article On Corona Virus Pandemic - Sakshi

రెండో మాట

‘‘అంటువ్యాధులతో మానవుడి పందెం ఈ రోజుది కాదు సుమా! ఈ భూతలంపై కొండలు, కోనల పుట్టుకతోనే మానవుడి జీవితం ముడిపడి ఉందని మరచిపోరాదు. ఈ విషయం ఘనాపాటీల రచనల్లో, కవితల్లో నిక్షిప్తమై ఉన్నవే’’.
– అర్ఘ్యకుమార్‌ బెనర్జీ, డీన్‌ ఆఫ్‌ ఆర్ట్స్, కోల్‌కతా
‘‘అంటు రోగాల వ్యాప్తి గురించిన ఉబు సుపోని, నిర్హేతుకమైన గుడ్డి నమ్మకాల నుంచి ప్రజల్ని విముక్తి చేయడం విజ్ఞాన శాస్త్రం ధర్మం. రోగాలు, రొష్టులు పనిగట్టుకుని ఫలానా జాతినో, ఫలానా ప్రాంతాన్నో, దేశాన్నో కావాలని వివక్షతో ఎంచుకోవు. అంటు వ్యాధులకు కావలసింది లేదా అవి ఆశ్రయించేది మానవ శరీరాన్ని– శీతోష్ణస్థితి గతులతో సంబంధం లేకుండా బలి ష్టమైన పోషకాలు లభించే మానవ శరీరాన్ని. దురదృష్టవశాత్తు వ్యాధి కారక పరాన్న జీవుల్ని గురించిన సశాస్త్రీయమైన వైజ్ఞానిక విజయాలకు సంబంధించిన అవగాహనను పక్కకు నెట్టేసి.. శాస్త్ర సాంకేతిక, వైద్య, వైజ్ఞానిక దృష్టిని కొందరు పక్కదారులు పట్టిస్తున్నారు’’.
– అమితాంగ్షు ఆచార్య, పీఏడీ స్కాలర్, ఎడింబరో, ఇంగ్లండ్‌ 

కత్తిని కత్తి రద్దు చేస్తుంది, యుద్ధం యుద్ధాన్ని జయిస్తుంది, అమా నుష వ్యాధిని శరీరంలోని విరోధ వ్యాధి లక్షణాలు లేదా ప్రతికూల క్రిములు (యాంటీ బాడీస్‌)ను సృష్టించడం ద్వారా నిర్మూలమవు తాయి. ఈ అనుకూల, ప్రతికూల క్రిముల సృష్టి రహస్యాన్ని జీవశాస్త్ర వైజ్ఞానిక పరిశోధనల ఫలితమేనని మరచిపోరాదు. జన్యు లక్షణాల మార్పిడిగానీ, మానవ శరీరంలో అనుకూల ప్రతికూల జన్యువులను, వాటి లక్షణాలను కనిపెడుతూ అనుకూల జన్యువుల సంరక్షణ కోసం జీవశాస్త్ర పరిశోధకులు అనునిత్యం తమ కళ్లను, మెదళ్లను పదును పెట్టుకున్న దాని ఫలితమే– టీకాలు, ఇంజక్షన్ల సృష్టి. మానవాళిని చరిత్రలో ఆరోగ్యపరంగా శతాబ్దాల తరబడి కకావికలు చేసి వదిలిన చిన్నవి, పెద్దవి మహమ్మారులు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ప్రపంచ దేశాలను పీడిస్తున్న మహమ్మారి ‘కరోనా’ వ్యాధి... గత కాలంలో కోట్ల సంఖ్యలోనే ప్రజల ప్రాణాలు తీసిన అంటువ్యాధు లకన్నా పెద్దది కాకపోయినా ప్రతి వందేళ్లకు వచ్చే ప్రమాదకర వ్యాధుల్లో ఒకటి.

వ్యాధుల కారణాలు అనేకం– ప్రకృతిని మచ్చిక చేసుకుని తన బతుకు తీర్చిదిద్దుకునే క్రమంలో పర్యావరణ స్పృహను కోల్పోయి, సంపదపై ఆబ కొద్దీ బడుగుజీవుల బతుకుదెరువును గాలికి వదిలి వేయడం, అందుకు పాలకవర్గాలు, ప్రభుత్వాలూ సహ కరించి, తమ ప్రలోభాల్ని ఈడేర్చుకోవడమూ చాపకింద నీరులా విధ్వంసకాండ జరిగి పోతూండటమూ. అయితే, ప్రతి నూరేళ్లకొకసారి తీవ్రస్థాయి అంటువ్యాధులు, కరోనాలాంటి మహమ్మారులు ‘దొంగ చాటు దూరబంధువుల్లా’ మానవాళిని కబళిస్తున్నాయి. యుద్ధాలు, క్రిమియుద్ధాలు, భారీ అణ్వస్త్ర ప్రయోగాలు వెదజల్లే ధూళిధూసరితా లవల్ల వాతావరణ కాలుష్యాల ద్వారాను ఇవి విస్తరిస్తున్నాయి. అయితే తిరిగి వీటిని అదుపుచేసి ప్రగతిరథాన్ని ముందుకు నడిపించుకోవ లసినవాడూ ఈ మానవుడేనని మరచిపోరాదు. తన ఉనికిని, మాన వాళి ప్రగతికి ఎదురయ్యే మహమ్మారులను తన అమోఘమైన శాస్త్ర పరిజ్ఞానంతోనే అదుపుచేసి తొలగించుకుంటూ ముందుకు దూసుకు పోతున్న ఈ మానవుడే తిరిగి మహనీయుడుగా అవతరిస్తున్నాడు. 

ఆ మహనీయతను చరిత్రలో తొలిసారిగా సాధించినవాడు క్రీస్తు పూర్వం 400 ఏళ్లనాడు హిప్పోక్రటీస్‌. ఈయన ప్లాటో, సోక్రటీస్, బుద్ధుని కాలంనాటివాడు. మనం చెప్పుకునే ఆధునిక వైద్య పితా మహుడు ఆనాటి హిప్పోక్రటిస్‌. గ్రీస్‌వాడైన ఆయన రచనల్ని, పరి శోధనల్ని కనుమరుగవకుండా కాపాడినవారు అరబ్బులేనని మరవ రాదు. అలా ఆయన గ్రీక్‌ వైద్య విధాన సూత్రాలను అరబ్బులు భద్ర పరచకపోతే ఆ రచనలు ఎప్పుడో కనుమరుగు అయ్యేవి. తన వైద్య విధానాన్ని హిప్పోక్రాటిస్‌ నాలుగు భాగాలు చేసి వాటికి ‘నాలుగు హాస్యాలు’ (హ్యూమర్స్‌) అని పేరుపెట్టాడు. అందరికీ బోధపడటం కోసం అవి: రక్తం, కాలేయంలో ఊరే పైత్య రసం, పచ్చరసం (కామెర్లు), కఫం లేదా శ్లేష్మం అని విభజించాడు. వ్యాధి తీరు తెన్నులనుబట్టి శరీరంలో సమతుల్యత నిర్ధారణ అవుతుందన్నాడు. వీటి సమతుల్యతమీదనే మనిషి చావు బతుకులు ఆధారపడి ఉంటాయిగానీ ఏ మంత్ర తంత్ర శక్తి వల్లనో నిర్ధారణ కావని తేల్చాడు. హిప్పోక్రాటిస్‌ వాడిన వైద్య పదాలన్నీ గ్రీసు పదాలే. వ్యాధుల గుణాల్ని క్రానిక్, ఎపెడిమిక్, ఎండెమిక్, గైనిక్, కార్డియా (గుండె), యుథనేసియా, ఆఫ్తాల్మస్, పిడియాట్రిక్స్‌.. ఈ పదసృష్టి అంతా హిప్పోక్రాటిస్‌ ధర్మమే సుమా! అంతేగాదు, వైద్యాన్ని, వైద్య శాస్త్రాన్ని మతం నుంచి వేరు చేసిన తొలి వైద్య శిఖామణి కూడా హిప్పోక్రాటిసే. 

‘కరోనా’ మహమ్మారిని ఇంతకుముందు పలు చిన్న, పెద్ద అంటు వ్యాధుల్ని కట్టడి చేసిన పద్ధతుల్లోనే అణచివేసి మానవుడే మహనీయుడని నిరూపించుకునే ఘడియ లకు చాలా దగ్గరలోనే ఉన్నాడని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుచూపు మేరల్లోనే కరోనాపై మానవుడు అంతిమ విజేత కాబోతు న్నాడు. ఇందుకు ప్రపంచంలో దాదాపు 280 కోట్ల జనాభాకు ప్రాతి నిధ్యం వహిస్తున్న భారత్‌–చైనా శాస్త్రవేత్తల, వైద్య పరిశోధకుల తొలి ప్రయత్నంగా ‘ప్లాస్మా థెరపీ’పై చేస్తున్న ప్రయోగాలు విజయవంత మయ్యే దశలో, కొద్ది మాసాల్లోనే ఫలప్రదమైన టీకాలు, ఇంజక్షన్ల రూపంలో బయ టపడే అవకాశాలు పెరిగాయి. దీనికి కారణమూ, ప్రేరణా కరోనా వ్యాధి వ్యాప్తి సందర్భంగా తొలి ప్రయోగ బాణంగా క్యూబా, చైనా, సోషలిస్టు దేశాలు వదిలిన ‘ప్లాస్మా చికిత్స’ విధానం.

నిరూపిత మైనంతవరకు దీని వైశిష్ట్యం–కరోనా వ్యాధి నుంచి కోలుకునే రోగు లకు, ప్లాస్మా (రక్తం) ఎక్కించి రోగ నిరోధానికి తోడ్పడే యాంటీ బాడీస్‌ (ప్రతికూల జన్యు కణాలు)ను తయారు చేయడం. ఈ యాంటీ బాడీస్‌ను రూపొందించడానికి ముందుకొచ్చే ‘ఫార్మా’ సంస్థలకు లైసెన్స్‌ ఇవ్వడానికి భారత వైద్య పరిశోధనా కేంద్రం ముందు కొచ్చింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రీయ సంస్థ ప్రకటిస్తే.. యాంటీబాడీస్‌ కలిగిన ప్లాస్మాను ఎక్కించడం ద్వారా ముగ్గురు కరోనా రోగులు కోలుకోగా, మరో ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ప్లాస్మాను ప్రయోగించిన మరో నలుగురు రోగులు పూర్తిగా కోలుకున్నారని కూడా కేంద్ర పరి శోధనా సంస్థ ఈ నెల 18న వెల్లడించింది. 

అందుకే సీసీఎంబీ డైరెక్టర్, శాస్త్రవేత్త రాకేశ్‌ మిశ్రా, నిర్వీర్యం చేసిన సూక్ష్మజీవితోనే టీకా (ప్లాస్మా చికిత్స) తయారీ సులువే అనే నిర్ణయానికి వచ్చి మూడునెలల్లోనే ప్రతికూల వైరస్‌ను ఉత్పత్తి చేస్తా మని భరోసా కల్పించారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసిన వైరస్‌లు ఒకటీ, ఆరా కాదు. ప్రధాన వైరస్‌ల పెక్కింటి ‘పుట్టెంట్రుకలు’ లెక్కపెట్టాలంటే.. క్రీ.శ. 165 నుంచి 180 దాకా, ఆ పిమ్మట 1919–1920 నుంచి ఈరోజు, శతాబ్ది మహ మ్మారిగా మారిన కరోనా వరకు వస్తూ పోతూనే ఉన్నాయి. దాదాపు వీటిలో పెక్కు వైరస్‌లు ‘ఫ్లూ’కు చిన్నా, పెద్దా తోబుట్టువులే. ఫ్లూ, ఇన్‌ఫ్లుయెంజా, న్యుమోనియో, సార్స్‌–2, కోవిడ్‌– 19 వరకు ఏదో ఒక రూపంలో ఇది  రాజకిరీటంలా నూతన మండ లాన్ని చుట్టిన కాంతి వలయంలా ఉన్నందున బ్రిటిష్‌ వైరాలజిస్టు డాక్టర్‌ డేవిడ్‌ టిర్రెల్‌ ఈ వైరస్‌లకు (1964–66) కరోనా వైరస్‌లు అని పేరు పెట్టాడు. 

ఇలా స్పానిష్‌ ఫ్లూ నుంచి ఏషియన్‌ ఫ్లూ (1957), ఎయిడ్స్‌ వ్యాధి కారక వ్యాధి మూలమైన హెచ్‌ఐవి, సార్స్‌ వైరస్‌ దాకా సామ్రాజ్య యుద్ధ కారణాల ఫలితంగా వాతావరణ కాలుష్యం ఆధారంగా పుట్టి పెరుగుతూ వచ్చిన వైరస్‌లే. ఎయిడ్స్‌ కారక మూలం హెచ్‌ఐవీ వైరస్‌ పుట్టి పెరిగింది ఆఫ్రికా ఖండంపై అమెరికా సామ్రాజ్యవాదం సాగిం చిన సైనికదాడి ఫలితం. అమెరికా సైనికులు సంసారాలకు దూరంగా సంవత్సరాల తరబడి ఆఫ్రికాలో గడపడం కారణంగా అక్కడి గొరి ల్లాలతో పెట్టుకున్న సంపర్కం వల్ల అంటించుకువచ్చిన  వ్యాధికి మరోపేరే హెచ్‌ఐవి. దాని మరోపేరు ఎయిడ్స్‌. అయితే దాన్ని ఆఫ్రికా వ్యాధి అని పేరుపెట్టి ఆ దేశానికి అంటగట్టలేము. అలాగే చైనాలోని వూహాన్‌ మార్కెట్‌లో మాంసాహారం తిన్న వారి నుంచి పుట్టిన కరో నాను చైనీస్‌ వైరస్‌ అని ట్రంప్‌లాగా ఒక దేశానికి అంటగట్టలేము. ఇంతకూ ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. అమెరికా సైనికులు ఆఫ్రికా చింపాంజీలతో సంపర్కంద్వారా పుట్టుకొచ్చిన హెచ్‌ఐవీ(ఎయిడ్స్‌) సంబంధిత వ్యాధుల వల్ల ప్రపంచంలో చని పోయిన వారి సంఖ్య 4 కోట్ల 48 లక్షలని అంచనా. ఇప్పటికి కరోనా వైరస్‌ విస్తృతిలో ప్రపంచ జనాభాలో సగంపైగా (450 కోట్లు) వ్యాధి గ్రస్తులు కాగా, మరణించిన వారి సంఖ్య  1,66,000కు చేరుకుంది.

సరిగ్గా ఈ సందర్భంలోనే, భారతదేశంలో ప్రజారోగ్య రక్షణ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నందువల్లనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు, క్వారంటైన్‌లో ఉన్న బాధితు లలో కొందరు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉండలేక పారిపోతున్నారని అంతర్జాతీయ జర్నల్‌ లాన్స్‌ట్‌ తాజా నివేదికలో వెల్లడించింది. ఇందుకు కారణం దేశ జాతీయోత్పత్తుల విలువలో కేవలం 1.5 శాతం మాత్రమే ఆరోగ్యరంగంపై కేంద్రప్రభుత్వం ఖర్చు చేస్తోందని మిగతా జనాభా అంతా ప్రయివేట్‌ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోందని రాసింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇలాంటి పరిస్థితిపై వ్యాఖ్యానిస్తూ జానన్‌ హికెల్‌ అనే ప్రపంచ ప్రసిద్ధ వ్యాఖ్యాత ఈ రకంగా వ్యంగీ కరించాడు. ‘పెట్టుబడిదారీ వ్యవస్థ 34 రకాల ఖరీదైన వెరైటీ డ్రెస్సులూ, 40 రకాల రోస్టులూ, టోస్టులనే కాకుండా.. యుద్ధాల కోసం 16,000 కిలోమీటర్ల దూరం వెళ్లి దాడి చేయగల ఖండాంతర క్షిపణుల్ని సిద్ధం చేయగలదు కానీ, ఏ కారణంవల్లో మౌలిక ప్రజారోగ్యానికి అవసరమైన మాస్క్‌లను, వెంటిలేటర్లను మాత్రం ఉత్పత్తి చేయలేకపోతోంది. అదీ అసలు రహస్యం.’

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top