నెంబర్ వన్ సైట్.. ఐఆర్సీటీసీ!!
ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా ఒక్క నిమిషం కూడా గడవని రోజులివి. అలాంటి ఇంటర్నెట్ ఎదురుగా ఉన్నా, ఫలానా సైట్ కావాలంటే నేరుగా దాంట్లోకి వెళ్లడం చాలామందికి అలవాటు లేదు. గూగుల్ ఓపెన్ చేయడం, అందులో తమకు కావల్సిన పేరును సంక్షిప్తంగా కొట్టడం, అప్పుడు వచ్చిన లింకుల్లోంచి తమకు కావల్సిన దాన్ని ఎంచుకోవడం బాగా అలవాటు. అలా ఈ సంవత్సరం మొత్తమ్మీద భారతీయులు ఎక్కువగా ఏయే సైట్ల కోసం సెర్చ్ చేశారో తెలుసా? అన్నింటికంటే అత్యధికంగా వెతికినది రైల్వే టికెట్ల రిజర్వేషన్ చేసుకోడానికి ఉపయోగపడే ఐఆర్సీటీసీ కోసమే!! టాప్ టెన్ సైట్లు చూసుకుంటే వాటిలో రైల్వే రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు వెయిటింగ్ లిస్టు గానీ, ఆర్ఏసీ గానీ వస్తే, ఆ తర్వాత దాని పరిస్థితి ఏంటో తెలుసుకోడానికి ఉపయోగపడే పీఎన్ఆర్ స్టేటస్. టాప్ టెన్ సైట్లలో ఈ రెండూ ఉండటం వీటికున్న ఆదరణను తెలియజేస్తుంది.
గూగుల్ సెర్చింజన్ నుంచి ఏయే సైట్ల కోసం ఎక్కువగా సెర్చ్ చేశారన్న విషయాన్ని గూగుల్ ఇటీవల ప్రకటించింది. దీంట్లో టాప్ టెన్ సైట్ల పేర్లను పేర్కొంది. మొట్టమొదటి స్థానంలో ఐఆర్సీటీసీ ఉండగా, రెండో స్థానంలో ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నిలిచింది. ప్రపంచంలో ఎక్కడ ఏ క్రికెట్ మ్యాచ్ జరిగినా బాల్ టు బాల్ ఏం జరిగిందోనన్న విషయాన్ని అందించే ఈ సైట్కు కూడా బోలెడంత ఆదరణ ఉంది. ఈ రెండింటి తర్వాత మిగిలిన వరుస స్థానాల్లో ఫ్లిప్కార్ట్, పీఎన్ఆర్ స్టేటస్, హెచ్డీఎఫ్సీ నెట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్, ఎస్ఎస్సీ, ఐబీపీఎస్, ఓఎల్ఎక్స్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి.