మహా కైలాసమూర్తి

Special story to Meenakshi Ammavari Temple - Sakshi

కథాశిల్పం 

తమిళనాడులో మధురై ప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరం. ఇక్కడ మీనాక్షి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయం మూడుప్రాకారాలతో, అనేక గోపురాలతో, గోపురాల నిండా దేవతా విగ్రహాలతో శోభిల్లుతుంటుంది.ఆలయానికి తూర్పున ఉన్న గోపురంపై పరమేశ్వరుని విగ్రహం ఉంది.సాధారణంగా శివుడు ఐదుముఖాలతో ఉంటాడు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాలనేవి ఆ ముఖాల పేర్లు. పంచభూతాలకు ఇవి ప్రతీకలు. పైగా పరమేశ్వరుడు పంచకృత్య నిపుణుడు. కానీ ఇక్కడ శివుడు 25 ముఖాలతో, యాభైచేతులతో వివిధ ఆయుధాలు ధరించి కనిపిస్తాడు. సద్యోజాతమూర్తి, వామదేవమూర్తి మొదలైన ఐదుగురు దేవతలు ఒక్కొక్కరూ ఐదు ముఖాలతో కనిపిస్తుండగా ఈ స్వామి ఆ ఐదుగురి సమిష్టిరూపం.

ఈయన ముఖాలు కింది వరుసలో 9, దానిపై 7, ఆపై 5, 3, 1 ఇలా బేసి సంఖ్యలో ఉంటాయి. కుడివైపు 25 చేతులతో, ఎడమవైపు 25 చేతులు ఉంటాయి. కైలాసపర్వతంపై పరమేశ్వరుడు ఇలాగే ఉంటాడని స్కాందపురాణం చెబుతోంది. మరికొన్నిచోట్ల ఈయనను మహాసదాశివమూర్తి అని కూడా పిలిచారు.ఈ విగ్రహంలోని 25 ముఖాలూ ఒక్కో కృత్యానికి 5 చొప్పున 25 లీలారూపాలను, ఆయా లీలారూపాలలో ధరించిన ఆయుధాలను  ధరించి కనిపిస్తున్నాడు. ఇరవై ఐదు రూపాలను దర్శిస్తే కలిగే ఫలితం ఒక్క మహా కైలాసమూర్తి దర్శనంతో లభిస్తుందని, సాలోక్య ముక్తి లభిస్తుందనీ శైవాగమాలు చెబుతున్నాయి.  తమిళనాడులోని కొన్ని ప్రసిద్ధ ఆలయగోపురాలపై తప్ప ఈ స్వామి ప్రత్యేక ఆలయంలో కొలువుదీరి కనపడడు. ఈయన ముక్తి ప్రదాత. సకల సిద్ధిప్రదాత కూడా. శివభక్తులే కాక ప్రతిఒక్కరూ ఈ స్వామి రూపాన్ని తప్పక దర్శించి తీరవలసిందే.
– డాక్టర్‌ ఛాయా కామాక్షీదేవి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top