
వాతావరణం చల్లబడితే గుండెపోట్లు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని అంటున్నారు తైవాన్ శాస్త్రవేత్తలు. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉన్నప్పుడు ఎక్కువమంది మరణించినట్లు గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పో జూయి వూ తెలిపారు. 2008 – 2011 మధ్యకాలంలో గుండెపోటుకు గురైన 40 వేల మంది వివరాలు.. రెండు ఇతర అధ్యయనాల ద్వారా సేకరించిన పది లక్షల మంది వివరాలను కలిపిపరిశీలించినప్డుపు ఈ విషయం స్పష్టమైందని ఆయన చెప్పారు. చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఛాతి నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి ఇబ్బందులు ఎదురై.. ఆ మరుసటి రోజు చాలామంది గుండెపోటుకు గురైనట్లు తెలిపారు.
చలికాలంలో ఎవరైనా గుండెపోటు తాలూకూ లక్షణాలతో ఉంటే జాగ్రత్త వహించాలని సూచించారు. గుండెపోట్లకు.. చలికాలానికి కార్యకారణ సంబంధం ఉందా? లేదా? అన్నది మాత్రం ఈ అధ్యయనం స్పష్టం చేయలేదు. ఆసియా పసఫిక్ కార్డియాలజీ సొసైటీ సమావేశంలో ఈ అధ్యయన వివరాలను ప్రకటించారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా.