నువ్వు పట్టుచీర కడితే...
పదం పలికింది – పాట నిలిచింది
సినిమా పాటను ఒక కావ్యస్థాయికి తీసుకెళ్లడం ప్రతిసారీ జరగదు. చిక్కటి కవిత్వం జాలువారిన అరుదైన వ్యక్తీకరణలు కొన్నిసార్లు చెవులకు మహా ఇంపుగా వినబడతాయి. అట్లాంటి ఒక భావన ‘సీతాకోకచిలుక’ చిత్రం కోసం వేటూరి సుందరరామ్మూర్తి రాశారు. ‘అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే’ గీతంలోని ఒక చరణంలో ఆయన రాసిన ఈ పాదాల్లో ఎంత కవిత్వం ఉంది! ప్రేయసిని ఇంతకంటే పొగడటం ఏ ప్రియుడికైనా సాధ్యమా! ‘నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ. దీనికి సంగీతం సమకూర్చింది ‘మైస్ట్రో’ ఇళయరాజా. పాడింది వాణీ జయరాం, ఇళయరాజా. 1981లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు భారతీరాజా. కార్తీక్, ముచ్చర్ల అరుణ నటించారు. ఒకేసారి షూటింగ్ ప్రారంభించిన ఈ ద్విభాషా చిత్రంలో, తమిళంలో ఇదే అర్థం వచ్చే పంక్తులు ఉండటమూ, వాటి కర్త వైరముత్తు అని ఉండటమూ విశేషం. అయితే ఈ భావానికి ఎవరు అసలు కర్త అనేది పరిశోధకులు తేల్చాల్సిన అంశం.