మమ్మల్ని కాపు కాచింది మీరే | ys vijayamma speech in vijayanagaram | Sakshi
Sakshi News home page

మమ్మల్ని కాపు కాచింది మీరే

May 4 2014 12:04 AM | Updated on Jul 25 2018 4:09 PM

మమ్మల్ని కాపు కాచింది మీరే - Sakshi

మమ్మల్ని కాపు కాచింది మీరే

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక నాలుగున్నరేళ్లలో ఎన్నో అకృత్యాలు, అరాచకాలు భరించాం.. అవమానాలు సహించాం.

వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ
 
 శృంగవరపుకోట (విజయనగరం), న్యూస్‌లైన్: ‘‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక నాలుగున్నరేళ్లలో ఎన్నో అకృత్యాలు, అరాచకాలు భరించాం.. అవమానాలు సహించాం. నేనూ, నాబిడ్డ కాంగ్రెస్ నుంచి బయటికి వస్తే రాజన్నవల్ల దగ్గర ఆర్థికంగా, రాజకీయంగా లబ్ధిపొందిన రాజకీయ నేతలెవ్వరూ మా వెంట నిలవలేదు. మీరు మా వెంట నిలిచారు... మమ్మల్ని కాపు కాచారు. మీ వల్లే ఈ రోజు మేము మీ ముందు నిలవగలిగాం. నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ మీ ప్రేమ మరిచిపోను. మీరు చూపే ఆత్మీయత, ఆదరాభిమానాలు మరిచిపోలేనివి.
 
 మీ గుండెల్లో రాజన్నను చూసుకుంటున్నా’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థి విజయమ్మ చెప్పారు. శనివారం ఆమె విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో పర్యటించారు. వేపాడ మండలంలో ఓబలయ్యపాలెం, ముకుందపురం, జగ్గయ్యపేట, లక్కవరపుకోట మండలంలో గొల్జాం, లక్కవరపుకోట, చందులూరు రేగ, లచ్చింపేట గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఎస్.కోటలో బాబాగుడి జంక్షన్‌తోపాటు పలు గ్రామాల్లో  విజయమ్మ ప్రసంగించారు. ‘‘మూడేళ్లుగా అకాల వర్షాలు, తుపానులతో రైతాంగం అవస్థలు పడుతున్నారు. ఈ ప్రభుత్వాలు వడ్డీలులేని రుణాలు ఇవ్వలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సరిగా చెల్లించలేదు. ఈ పరిస్థితులు తొలగాలంటే మనసున్న నేతను, మంచి నాయకుణ్ని, మీ గుండెచప్పుడు వినే నేతను ఎన్నుకోవాలి. కులమతాలకు అతీతంగా అందరి బాధలు వినే నేత ను ఎన్నుకోవాలి. నాలుగేళ్లుగా జగన్‌బాబు మీతోనే ఉన్నాడు, మీ బాధలు విన్నాడు. రాజన్న సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ అందిస్తాడు. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement