మాపై సస్పెన్షన్లను ఎత్తివేయండి | teachers demand for to remove suspension | Sakshi
Sakshi News home page

మాపై సస్పెన్షన్లను ఎత్తివేయండి

Apr 17 2014 3:08 AM | Updated on Sep 2 2017 6:07 AM

ఇటీవల జరిగిన ఎంపీటీసీ,జెడ్‌పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొని సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

నర్సాపూర్,న్యూస్‌లైన్: ఇటీవల జరిగిన ఎంపీటీసీ,జెడ్‌పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొని సస్పెన్షన్‌కు గురైన  ఉపాధ్యాయులను  తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.  బుధవారం నర్సాపూర్‌లో నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల పీఓలు, అసిస్టెంటు పీఓలకు శిక్షణ ఇచ్చారు. కాగా శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాణయ్య,కృష్ణస్వామి, యాదగిరి, రవికుమార్, సంగయ్య, శ్రీనివాస్‌రావు, బుచ్చిరెడి తదితరులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్‌కు  వినతి పత్రం అందచేశారు.

ఇటీవల జిల్లాలో జరిగిన ఎంపీటీసీ ,జెడ్‌పీటీసీ ఎన్నికల విధుల్లో  పాల్గొన్న ఉపాధ్యాయుల్లో ఐదుగురిని సస్పెండ్ చేశారని, ఈ విషయంలో ఉపాధ్యాయుల తప్పు లేకపోయినా వారిని  సస్పెండ్ చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అంతేగాక పీఓలకు,ఏపీఓలకు సమానంగా అలవెన్సులు ఇవ్వాలని  డిమాండ్ చేస్తూ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తాము శిక్షణ కార్యక్రమాన్ని అరగంట పాటు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

ఉపాధ్యాయ సంఘం నేతల  డిమాండ్‌ను రిటర్నింగ్ అధికారి రవీందర్  డీఈఓ  రమేశ్ దృష్టికి తీసుకవెళ్లారు. ఈ విషయమై డీఈఓ స్పందిస్తూ వారంలోగా వారిని విధుల్లోకి తీసుకుంటామని  హామీ ఇచ్చినట్లు  రిటర్నింగ్ అధికారి తెలిపారు. దీంతో ఉపాధ్యాయ సంఘం నేతలు శాంతించడంతో శిక్షణ కార్యక్రమం యధావిధిగా కొనసాగింది.

 పీఓలు, ఏపీఓలకు శిక్షణ
 నర్సాపూర్ నియోజకవర్గంలోని పీఓలు,ఏిపీ ఓలకు బుధవారం శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా వారికి ఏవీఎంల పనితీరు, ఇతర అంశాలపై  రిటర్నింగ్ అధికారి రవీందర్, అసిస్టెంటు రిటర్నింగ్ అధికారి నరేందర్, ఇతర అధికారులు శిక్షణ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement