కేసీఆర్.. ఖబడ్దార్! | Sakshi
Sakshi News home page

కేసీఆర్.. ఖబడ్దార్!

Published Tue, Mar 25 2014 2:02 AM

Arepalli Mohan kcr said leader trs

 తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : కేసీఆర్.. నువ్వు కాంగ్రెస్ గురించి ఒక్కటి కాదు, రెండు కాదు.. వంద తప్పుడు కూతలు కూశా వ్.. అయినా మిన్నకున్నాం.. కానీ దళితులను ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు.. ఖబడ్దార్ అంటూ మానకొండూర్ ఎ మ్మెల్యే ఆరెపల్లి మోహన్ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. దొరతనాన్ని ఫాంహౌజ్‌లో, గడీల్లో చూపించుకోగానీ దళితులపై ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిం చారు. సోమవారం ఆయన మండలంలోని రామకృష్ణకాలనీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితులెవరూ అడగకముందే తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే సీఎం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు మాటమార్చడమెందుకని ప్రశ్నించారు. ఇది దళితులను అవమానపరచడమే అన్నారు.

తెలంగాణ వస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో వి లీనం చేస్తానన్న ఆయన మాటకు కట్టుబడి ఉండకపోవడం ఆయన నైజమేమిటో తెలిసిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కృతజ్ఞత తెలిపి న ఆయన కాంగ్రెస్‌పై లేనిపోని మాటలు మాట్లాడడం తగదన్నారు. స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లిన గాంధీ కుటుంబ సభ్యులు ఎవరూ పాలించడం లేదని, ఒక్క కేసీఆర్ కుటుం బంలో తప్ప ఉద్యమాలు నడిపించిన వారిలో కుటుంబ పాలన లేదన్నారు. దళితులపై దొరతనం చలాయిస్తే ఎదురుదాడికి దిగక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ కేసీఆర్ జాగీ ర్ అన్నట్లుగా మాట్లాడుతున్నారని, అమరుల త్యాగాలు, విద్యార్థులు, జేఏసీ నాయకులు, కుల సంఘాల ఆందోళనతో రాష్ట్రం వచ్చిందన్నారు.

కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఉండి కరీంనగర్ జిల్లాకు, తెలంగాాణకు దమ్మిడిపైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. మానకొండూర్ నియోజకవర్గంపై ఇతరుల పెత్తనం చూపేందుకు అభ్యర్థిని ఎందుకు పంపారని, ఇక్కడ దళితులు లేరా..అని ప్రశ్నించారు. ఇకనైనా కిలాడీ చంద్రశేఖర్‌రావు నాలుక దగ్గరపెట్టుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఆయన వెంట కేడీసీసీబీ డెరైక్టర్ దేవేందర్‌రెడ్డి, తదితర నాయకులున్నారు.

Advertisement
Advertisement