అనుభవం పరిణతిని తీసుకురావాలి. సంయమనాన్ని, హుందాతనాన్ని నేర్పాలి. కానీ, అలాంటి లక్షణాలు తనకు లేవని ఎప్పటిలా కాంగ్రెస్ నిరూపించుకుంది.
అనుభవం పరిణతిని తీసుకురావాలి. సంయమనాన్ని, హుందాతనాన్ని నేర్పాలి. కానీ, అలాంటి లక్షణాలు తనకు లేవని ఎప్పటిలా కాంగ్రెస్ నిరూపించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు గట్టి పోటీ కాగలదనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోవడం ఎలాగో తెలియక, దాని ప్రభంజనాన్ని తట్టుకోవడం ఎలాగో అర్ధం కాక కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం తనకలవాటైన వేధింపుల పర్వానికి తెరతీసింది. ఆ పార్టీకి విదేశాలనుంచి వచ్చిన విరాళాలపై దర్యాప్తు జరపాలని నిర్ణయించింది. ‘మీ పార్టీకొచ్చిన నిధులెక్కడివ’ంటూ ఒక బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ప్రశ్నించిన మర్నాడే కేంద్రం ఈ చర్యకు పూనుకున్నది.
ఢిల్లీ ఎన్నికలు వచ్చే నెల 4న జరగబోతున్నాయి. పుట్టి నిండా ఏడాది కాకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ జనం ఆదరాభిమానాలను పొందిందన్న సంగతిని దాదాపు ఎన్నికల సర్వేలన్నీ ప్రకటించాయి. ఆ పార్టీకి గణనీయమైన సంఖ్యలో స్థానాలు లభించే అవకాశం ఉన్నదని, ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీది కీలక పాత్ర కాబోతున్నదని సర్వేలన్నీ అంటున్నాయి. పర్యవసానంగా ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు మొదలైంది. ఆ రెండు పార్టీలూ ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతున్న సిద్ధాంతాలనూ, అది ఇస్తున్న హామీలనూ పూర్వ పక్షం చేసివుంటే... అందులోని డొల్లతనాన్ని నిరూపించగలిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. రాజకీయంగా సవాల్ చేస్తూ ముందుకొచ్చిన పక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం నిజాయితీ ఉన్నవారు చేసేపని. కానీ, కాంగ్రెస్ ఎప్పుడూ తనకలవాటైన మార్గాన్నే ఎంచుకుంది. ప్రత్యర్థుల్ని వేధించడమనే వెనకటి గుణాన్నే మరోసారి ప్రదర్శించింది.
తమ పార్టీకొస్తున్న విరాళాల వివరాలను ఆమ్ ఆద్మీ పార్టీయే స్వయంగా ప్రకటించింది. విరాళాలిచ్చినవారి పేర్లను కూడా ఆన్లైన్లో ఉంచింది. అందులో విదేశాలనుంచి అందిన విరాళాలు కూడా ఉన్నాయి. ఇలా ఈ నెల 8 వరకూ తమకు రూ.19 కోట్లు వచ్చినట్టు ఆ పార్టీ వివరించింది. ఇందులో రూ.13.44కోట్లు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి రాగా, మిగిలిన సొమ్ము విదేశాలనుంచి వచ్చింది. ఇందులో అమెరికానుంచి రూ.1.98కోట్లు, హాంకాంగ్నుంచి రూ.1.14కోట్లురాగా మిగిలిన సొమ్ము సింగపూర్, యూఏఈ, బ్రిటన్ల నుంచి వచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టానికి 2003లో తీసుకొచ్చిన సవరణద్వారా చేరిన సెక్షన్ 29బీ ప్రకారం రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వ కంపెనీలు మినహా ఇతర కంపెనీలనుంచి విరాళాలు స్వీకరించవచ్చు. అయితే, అవన్నీ మన దేశానికి సంబంధించినవే అయివుండాలి. ‘విదేశీవర్గాల’నుంచి కూడా విరాళాలు సేకరించడం పూర్తిగా నిషిద్ధం. అది విదేశీ సంస్థ అయినా, విదేశీ సంస్థకు అనుబంధమైనా అలాంటి సంస్థలనుంచి విరాళాలు తీసుకోరాదని చట్టం స్పష్టంగా చెబుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నిబంధనలను ఉల్లంఘించి విరాళాలు స్వీకరించివుంటే అది చట్టప్రకారం నేరమే అవుతుంది. కానీ, తమకు విదేశాలనుంచి వచ్చిన విరాళాలన్నీ అక్కడ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న ప్రవాస భారతీయుల నుంచి అందినవేనని ఆ పార్టీ చెబుతోంది. అలా డబ్బులిచ్చినవారంతా భారత పాస్పోర్టులు కలిగివున్నవారేనని అంటున్నది.
నిజానికి విదేశాల్లోనివారి నుంచి విరాళాలు వచ్చినట్టు ఆ పార్టీ చెబితేనే తెలిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిన విషయాన్ని యథాతథంగా నమ్మాలని ఏంలేదు. అందులో నిజానిజాల గురించి దర్యాప్తు చేయడంలో తప్పేమీ లేదు. కానీ, అందుకు ఎంచుకున్న సమయమూ, సంద ర్భమూ తప్పు. దర్యాప్తునకు ఆదేశించారు గనుక అందులో ‘ఏదో ఉన్నట్టుంద’ని అం దరూ భావించడానికి ఆస్కారం కల్పించడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పని చేసిం దని వర్తమాన పరిణామాలను గమనిస్తున్నవారెవరికైనా స్పష్టంగానే అర్ధమవుతుంది.
అయితే, ఇది తమకు పుట్టిన బుద్ధి కాదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతున్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది గనుక ఈ దర్యాపును చేబట్టామని అంటున్నారు. అది నిజమే. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఇంత తొందరగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం పనిలో పనిగా కాంగ్రెస్, బీజేపీలకు అందుతున్న విరా ళాల విషయంలోనూ దర్యాప్తు చేయడానికి సిద్ధపడితే ఎవరికీ అభ్యంతరం ఉండక పోయేది. ఎందుకంటే సరిగ్గా ఇలాంటి ఆరోపణలే కాంగ్రెస్,బీజేపీలపైనా వచ్చాయి. ఆ పార్టీలకు బ్రిటన్కు చెందిన వేదాంత గ్రూప్ సంస్థనుంచి, దానికి అనుబంధంగా ఇక్కడ పనిచేస్తున్న స్టెరిలైట్వంటి సంస్థలనుంచి కోట్లాది రూపాయలు విరాళాలుగా అందాయని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదులను ఎన్నికల సంఘం గత ఏడాది సెప్టెంబర్లో కేంద్ర హోంశాఖకు పంపినా దాని అతీగతీ తేల్చలేదు. చివరకు ఆ సంస్థ గత మార్చిలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మీ సంజాయిషీ ఏమిటని న్యాయస్థానం నిలదీసినప్పుడు కేంద్రం ఇచ్చిన జవాబు వింతగా ఉంది.
ఎన్నికల సంఘం పంపిన ఫిర్యాదులపై ఆయా పార్టీలను వివరణకోరామని, వాటినుంచి జవాబు రావలసి ఉన్నదని కేంద్ర హోంమంత్రిత్వశాఖ న్యాయస్థానానికి తెలిపింది. అది అంతకుమించి ముందుకెళ్లింది లేదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలొచ్చిన నేపథ్యంలో మొత్తం అన్ని పార్టీలకు అందిన విరాళాలపైనా దర్యాప్తునకు ఆదేశిస్తే కేంద్రం నిజాయితీ వెల్లడ య్యేది. నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టు చెప్పుకోవడానికి ఉండేది. కానీ, ఆరోపణ లొచ్చినా మన్నుతిన్న పాముల్లా కూర్చున్నవారిని వదిలి... ఏ పార్టీ చేయనివిధంగా విరాళాల గురించి బాహాటంగా ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీపై మాత్రమే ప్రతాపం చూపింది. ఇలా వ్యవహరించడం యూపీఏ ప్రభుత్వానికి ఇది మొదటిసారి కాదు. చివరిసారి కూడా కాబోదు. ఎన్నిసార్లు తలబొప్పి కడుతున్నా తమ వ్యవహారశైలిని సవరించుకోవాలని కాంగ్రెస్ పెద్దలకు తోచడంలేదు. ఒక పార్టీని వేధించడం ద్వారా నో, ప్రజల్లో ఆ పార్టీపై అనుమానాలు కలగజేయడంద్వారానో చిత్తు చేయవచ్చన్న చవకబారు ఎత్తుగడలకు కాంగ్రెస్ ఎంత త్వరగా స్వస్తి పలికితే అంత మంచిది.