
దేశం కోసం ప్రాణాలిచ్చిందెవరు?
‘నరేంద్రమోదీ ఆయేగా...అచ్ఛాదిన్ లాయెగా’ అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు..
► ఉగ్రవాదానికి చరమగీతం పాడాలి
► మోసాలు చేయడం టైజమ్ కంటే ప్రమాదం
► ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్
మహబూబ్నగర్ అర్బన్ : ‘నరేంద్రమోదీ ఆయేగా...అచ్ఛాదిన్ లాయెగా’ అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు.. దేశం కోసం ప్రాణాలిచ్చింది ఎవరో చెప్పాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతురావు బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని రూపుమాపాలని కోరుతూ తెలంగాణలో పర్యటిస్తున్న వీహెచ్ శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ముందుగా అశోక్ టాకీస్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం యాంటీ టైజమ్పై జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెప్పించి ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున బ్యాంకుల్లో జమచేస్తామని ప్రజలను మోసం చేశారన్నారు.
విజయమాల్యా రూ.కోట్లు కొల్లగొట్టాడని, అగ్రిగోల్డ్ సంస్థ ప్రజల డబ్బును ఎగ్గొట్టినా కేంద్రం ఏం చేస్తున్నదని దుయ్యబట్టారు. రాజీవ్గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు, రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల స్వయంపాలన, మహిళా రిజర్వేషన్లు కల్పించారన్నారు. ప్రపంచ దేశాలకు దీటుగా కంప్యూటర్ రంగాన్ని విస్తరించారన్నారు. ఏఐసీసీ మరో కార్యదర్శి,వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నించిన వారి నోర్లు కుట్టేస్తాం, నాలు కోసేస్తామని బెదిరిస్తూ నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.
ఉగ్రవాదం అంతానికి అందరం కృషిచేయాలని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎంపీ మల్లు రవి, మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, నాయకులు ముత్యాల ప్రకాశ్, రంగారావు, గోపాల్యాదవ్, హనీఫ్, అమరేందర్ రాజు, పటేల్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.