కామన్ సివిల్కోడ్ను వ్యతిరేకిస్తాం
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఇస్లాం మత ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని..
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నసీర్ అహ్మద్
కొరిటెపాడు (గుంటూరు): కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఇస్లాం మత ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి యం.డి.నసీర్ అహ్మద్ ఆరోపించారు. కామన్ సివిల్కోడ్ను వ్యతిరేకిస్తూ ముస్లిం నాయకులతో కలసి బుధవారం నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులతో మార్కెట్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, మతపరమైన హక్కులను కాలరాస్తూ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ప్రతి ముస్లిం యువకుడు, మహిళ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముస్లిం నాయకులు షేక్ గులాం రసూల్, యం.డి.హిదాయతుల్లా, యం.డి.అస్లం మట్లాడుతూ ముస్లిం హక్కులకు భంగం కల్గించిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని హెచ్చరించారు.