చంద్రబాబుపై ఉండవల్లి విసుర్లు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు.
రాజమండ్రి: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా డిమాండ్ ను నెరవేర్చలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 2 రాష్ట్ర బంద్ నకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తీరును ఉండవల్లి ఎండగట్టారు.
ఇంకా ఉండవల్లి ఏమన్నారంటే... "చంద్రబాబు ఈ రోజు మీరు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని చూశాను. ఈ సమావేశంలో బంద్ను వ్యతిరేకిస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు సముచితంగా లేవన్నారు. మీడియా సమావేశంలో విలేకరులతో మీరు మాట్లాడుతూ.. ఏపీలో బంద్ వల్ల కలిగే పరిణామాల గురించి వివరించిన తీరును చూస్తే నాకు ఆశ్చర్యమనిపించింది. గతంలో తెలంగాణలో టీడీపీ బంద్నకు పలుమార్లు పిలుపునిచ్చిన సంగతి మేం కూడా చూశామని ఉండవల్లి అన్నారు.
బాబ్లీ సమస్యపై మహారాష్ట్ర పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేయడంతో 2010లో మీరు ఏపీ బంద్కు పిలుపునిచ్చిన విషయం తనకు బాగా గుర్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరులో మేయర్ హత్య ఘటనపై టీడీపీ బంద్కు పిలుపు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే.. ఈ నెల 2న జరిగే ప్రత్యేక హోదా బంద్కు మద్దతు ఇవ్వాలని ఉండవల్లి చంద్రబాబును కోరారు. అప్పుడే కేంద్రానికి ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమనేది తెలిసివస్తుందని ఉండవల్లి పేర్కొన్నారు.


