కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో సోమవారం ఉదయం జరిగింది.
మునగాల(సూర్యాపేట జిల్లా): ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కోదాడ మండలం కోమరబండ గ్రామానికి చెందిన ముగ్గురు కార్మికులు ద్విచక్రవాహనంపై మునగాల మండలం ఆముపాముల గ్రామానికి వెళుతుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొంది.
ఈ సంఘటనలో ద్విచక్రవాహనంపై వెళుతున్న మాదాసు లక్ష్మణరావు, కారపాటి ఉపేందర్ అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి క్షతగాత్రుణ్ణి ఆస్పత్రికి తరలించారు.