
దొంగల భీభత్సం
గుంతకల్లు పట్టణంలో శనివారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హనుమేష్నగర్, గంగానగర్, అల్లీపీరా, ఇందిరా కాలనీల్లో తాళం వేసిన ఐదు ఇళ్లల్లో దుండగులు చోరీలకు తెగబడ్డారు.
– గుంతకల్లులో ఐదు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దుండగులు
– 14.5 తులాల బంగారు, 80 వేల నగదు అపహరణ
– సీసీ ఫుటేజీ ఆధారంగా 7 మందిపై అనుమానం
గుంతకల్లు టౌన్ : గుంతకల్లు పట్టణంలో శనివారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హనుమేష్నగర్, గంగానగర్, అల్లీపీరా, ఇందిరా కాలనీల్లో తాళం వేసిన ఐదు ఇళ్లల్లో దుండగులు చోరీలకు తెగబడ్డారు. ఆయా ఇళ్లల్లో బీరువాల్లో ఉంచిన మొత్తం 14.5 తులాల బంగారు రూ.80 వేల నగదును దోచుకెళ్లారు. ఒకరిద్దరు కాదు ఏకంగా ఏడు మందితో కూడిన దొంగల ముఠానే ఈ చోరీలకు పాల్పడి హల్చల్ చేసినట్లు సీసీ కెమెరాల్లోని ఫుటేజీ ఆధారంగా తెలిసింది. ఒకే రోజు ఐదు ఇళ్లల్లో దొంగతనాలు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. .
కానిస్టేబుల్ ఇంట్లో..
పట్టణంలోని అల్లీపీరా కాలనీకి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ జె.రమేష్కుమార్ ఇంట్లో 12 తులాల బంగారు, రూ.40 వేల నగదును దొంగలు దోచుకెళ్లినట్లు అతడి భార్య అంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఇందిరా కాలనీలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు సురేష్ ఇంట్లో 15 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.30 వేలు నగదును ఎత్తుకెళ్లారు. అలాగే గంగానగర్లోని హైదర్ ఇంట్లో తులం బంగారు ఆభరణాలు, ఒక జత వెండి పట్టీలు, రూ.8 వేలు, మెకానిక్ వన్నూరప్ప ఇంట్లో రూ.2 వేలు, ఇరానీ ఫర్హా ఇంట్లో రూ.3 వేలను ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. చోరీలు జరిగిన ఇళ్లను ఎస్సై నగేష్బాబు సిబ్బందితో పరిశీలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
సీసీ కెమెరాల్లో గుర్తింపు
హనుమేష్నగర్లోని వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన విజువల్స్ మేరకు మొత్తం ఏడుగురు దొంగల్లో ఒకరిద్దరు ముఖాలకు మాస్క్లు ధరించారు. చేతుల్లో రాడ్లు, కట్టర్లు పట్టుకుని ఉమర్ ఇంట్లో చొరబడ్డారు. కాగా వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు అనుమానితుల్ని పోలీసులు విచారించారు.