గర్భిణుల ఆందోళనపై డీసీహెచ్ఓ విచారణ | The investigation concerns of pregnant women dcho | Sakshi
Sakshi News home page

గర్భిణుల ఆందోళనపై డీసీహెచ్ఓ విచారణ

Jul 31 2016 2:17 AM | Updated on Sep 4 2017 7:04 AM

ప్రసవం కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చిన గర్భిణుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేసినందుకు నిరసిస్తూ ఇటీవల గర్భిణులు ఆందోళ చేపట్టిన నేపథ్యంలో విచారించడానికి శనివారం జిల్లా కమ్యూనిటీ ఆఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (డీసీహెచ్‌ఓ) డా.రమేష్‌ కదిరికి వచ్చారు.

కదిరి టౌన్‌ : ప్రసవం కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చిన గర్భిణుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేసినందుకు నిరసిస్తూ ఇటీవల గర్భిణులు ఆందోళ చేపట్టిన నేపథ్యంలో విచారించడానికి శనివారం జిల్లా కమ్యూనిటీ ఆఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (డీసీహెచ్‌ఓ) డా.రమేష్‌ కదిరికి వచ్చారు. శనివారం సాయంత్రం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గైనకాలజిస్ట్‌ డా.విజయలక్ష్మిని, ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డా.రామక్రిష్ణయ్య, శెలవులో ఉన్న డా.బాషా, లేబర్‌ వార్డులోని వైద్యసిబ్బందిని పిలిపించి విచారించారు. మత్తు డాక్టరు సెలవు పెడితే ప్రైవేటు మత్తు డాక్టరును పిలిపించి సిజేరియన్లు చేసే అవకాశం ఉండీ ఎందుకు ఆ విధంగా చేయలేదని మందలించారు. రోగులు ప్రభుత్వాసుత్రికి ఎంతో నమ్మకంతో వస్తారని, అలాంటిది వారి ఆశలు ఆడియాశలు చేయకండని ఆగ్రహించారు. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణుల నుంచి డబ్బులు ఎందుకు ఆశించారో వివరణ ఇవ్వాలని వైద్యసిబ్బందిని ప్రశ్నించారు. తాము ప్రసవం కోసం గర్భిణుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేయలేదని చెప్పగా అంతలోనే పాత్రికేయులు కల్పించుకుని సార్, ఇక్కడ మగ బిడ్డకు ఒక రేటు, ఆడబిడ్డ ప్రసవిస్తే మరో రేటు నిర్ణయిస్తారని ప్రశ్నించారు. దీంతో డీసీహెచ్‌ఓ అక్కడే ఉన్న వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటిది అని ప్రశ్నించగా వారు నీళ్లు న మిలారు. ఏది ఏమైనా ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వసూలు చేసినా డబ్బు డిమాండ్‌ చేసినట్లు తమ దృష్టికి వచ్చినా కఠిన చర్యలు తప్పవన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement