కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం

Published Wed, Jul 5 2017 8:01 AM

కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం - Sakshi

సంగారెడ్డి జోన్‌/రూరల్‌: సదాశివపేట పట్టణ పరిధిలో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి పొజిషన్‌ చూపించాలంటూ చేపట్టిన ‘కలెక్టరేట్‌ ముట్టడి’ ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నాలు గు రోజులుగా సదాశివపేట కేంద్రంగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన జగ్గారెడ్డి మంగళవారం కలెక్టరేట్‌ ముట్ట డికి పిలుపునిచ్చారు. పట్టణంలోని రామ మందిరం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లేందుకు అనుచరులతో సిద్ధమయ్యారు. రామ మందిరం వద్దే  జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంద్రకరణ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు.

తీవ్ర ఉద్రిక్తం..
జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో అతని అనుచరులు వాహనానికి అడ్డుపడి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి, జహీరాబాద్‌ డీఎస్పీలు తిరుపతన్న, నల్లమల్ల రవి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

స్థలాలు ఇచ్చే వరకు పోరాటం..
నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని   జగ్గారెడ్డి వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసి ఇంద్రకరణ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా అక్కడే విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20 వరకు పేదలకు పట్టాలు అందజేసిన 5,500 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేదలకు త్చమ హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని అడ్డుకుంటోందని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇళ్లస్థలాలు ఇప్పించే వరకు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ తోపాజి అనంతకిషన్, సంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు పండరీనాథ్‌గౌడ్, నాయకులు వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు బుచ్చిరాములు, దశరథ్, మల్కయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement