ఉదయం అంతా ఆట పాటలతో పాఠశాలలో సరదాగ గడిపి.. బడి గంట మోగగానే పరుగున ఇంటికి చేరుకొని తోటి స్నేహితులతో ఆటలు ఆడుకునే క్రమంలో బండరాయి ఓ బాలుడిని బలిగొంది.
బాలుడిని బలిగొన్న బండరాయి
Mar 1 2017 11:58 PM | Updated on Jul 12 2019 3:02 PM
కొలిమిగుండ్ల: ఉదయం అంతా ఆట పాటలతో పాఠశాలలో సరదాగ గడిపి.. బడి గంట మోగగానే పరుగున ఇంటికి చేరుకొని తోటి స్నేహితులతో ఆటలు ఆడుకునే క్రమంలో బండరాయి ఓ బాలుడిని బలిగొంది. ఈ విషాదకర ఘటన బుధవారం అంకిరెడ్డిపల్లెలోని చింతలాయిపల్లె రోడ్డు సమీపంలోని కాలనీలో చోటు చేసుకుంది. మంజుల వెంకటస్వామి, రమణమ్మ దంపతుల కుమారుడు శివమణి(8).. స్థానిక మెయిన్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం బడి వదిలిన తర్వాత ఇంటికి చేరుకొని అదే కాలనీలోని స్నేహితులతో ఆటలు అడుకుంటున్నారు. మరొక బాలుడు సైకిల్ తొక్కుతున్న క్రమంలో ఓ ఇంటి ముందు అడ్డుగా పాతుకున్న ఏడు అడుగుల బండరాయిని తగిలించాడు. దీంతో రాయి విరిగి పడి సమీపంలోనే ఉన్న శివమణి తలపై పడింది. రక్తపుమడుగులో తీవ్రగాయాల పాలైన బాలుడిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా తాడిపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తల్లితండ్రులు నాపరాతి గనిలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారు. కుమారుడు మృతి చెందడంతో బోరున విలపించారు.
Advertisement
Advertisement