రాష్ట్రస్థాయి సైకిల్ పోలో పోటీలు ప్రారంభం
స్థానిక నెహ్రూ ఇంగ్లిష్ మీడియం క్రీడామైదానంలో మూడో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్, జూనియర్ బాలుర సైకిల్ పోలో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి.
బనగానపల్లె రూరల్: స్థానిక నెహ్రూ ఇంగ్లిష్ మీడియం క్రీడామైదానంలో మూడో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్, జూనియర్ బాలుర సైకిల్ పోలో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర సైకిల్ పోలో సంఘం ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదన్నారు. స్పోర్ట్స్ కోటాను సక్రమంగా అమలు చేసి క్రీడాకారులను ప్రోత్సాహించాలని సూచించారు. నిర్వాహక కమిటీ చైర్మన్ కోడూరు హరినాథ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి సైకిల్ పోలో పోటీలు తమ పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి పోటీల ద్వారా విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన పెంపొందించుకునే అవకాశం లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రధర్శించిన సాంస్కృతిక కార్యక్రమలు అలరించాయి. మొదటి రోజు పోటీల్లో కృష్ణా జిల్లా జట్టు 2–0 గోల్స్తో కర్నూలు జట్టు పై విజయం సాధించి. ఈ పోటీలు ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. సైకిల్ పోలో జిల్లా సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎ.వి.రామ సుబ్రమణ్యం, కమిటీ కార్యదర్శి రామాంజనేయులు, స్కూల్ డైరెక్టర్ రవితేజారెడ్డి, హెచ్ఎం కమల్తేజారెడ్డి, ఎంఈవో నాగమణి తదితరులు పాల్గొన్నారు.