నల్లగొండ జిల్లాకు చెందిన సమస్త సమాచారాన్ని గ్రంథస్తం చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు హైకోర్టు సీనియర్ న్యాయవాది కోటా విద్యాసాగర్రెడ్డి తెలిపారు.
నల్లగొండ జిల్లా సమాచార రచనకు శ్రీకారం
Sep 9 2016 12:58 AM | Updated on Aug 29 2018 4:18 PM
హబ్సిగూడ: నల్లగొండ జిల్లాకు చెందిన సమస్త సమాచారాన్ని గ్రంథస్తం చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు హైకోర్టు సీనియర్ న్యాయవాది కోటా విద్యాసాగర్రెడ్డి తెలిపారు. 1952వ సంవత్సరం మొదలుకొని 2015 వరకు జిల్లా సంపూర్ణ సమగ్ర సమాచారాన్ని గ్రంథస్తం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లును కలిసి ఆయనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్రెడ్డి మాట్లాడుతూ... నల్లగొండ జిల్లాలోని తెలంగాణ సాయుధ పోరాటం, జైన బౌద్ధ మతం, జిల్లా నీటి పారుదల, జిల్లా పరిశ్రమలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, హైకోర్టు న్యాయమూర్తులు, వైద్య రంగ నిపుణులతోపాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచిన ప్రముఖులకు సంబంధించిన విశేషాలను సేకరిస్తామన్నారు. అలాగే వివిధ దేవాలయాల చరిత్రలను నల్లగొండ జిల్లా రచయిత జిన్నం అంజయ్య ఆధ్వర్యంలో గ్రంథ రచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ గ్రంథ రచన పూర్తయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ఆవిష్కరింపజేస్తామన్నారు. జిల్లాకు సంబంధిచిన, ఇతర జిల్లాల్లో నివసిస్తున్న నల్లగొండవాసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు రచయితలు, కవులు, జర్నలిస్టులు సహకరించాలని కోరారు.
Advertisement


