
రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకొచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు.
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకొచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామివారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు తెలియజేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. వేద పండితులు వేద ప్రవచనాలు చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. అనంతరం రామయ్యకు ఘనంగా నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి శుక్రవారపు అభిషేకం..
రామాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీతాయారమ్మ వారికి వైభవంగా అభిషేకం చేశారు. పవిత్ర గోదావరి నది జలాలు, పండ్ల రసాలు, హరిద్రా చూర్ణాలు, నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చనలు చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.