పౌరాణికానికి పద్యాలంకరణ | Valluru Srihari Rao talks about World Theatre Day | Sakshi
Sakshi News home page

పౌరాణికానికి పద్యాలంకరణ

Mar 27 2026 3:03 AM | Updated on Mar 27 2026 3:03 AM

Valluru Srihari Rao talks about World Theatre Day

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం...

తెలుగు నాటక కళారంగంలో వల్లూరు శ్రీహరి రావు పద్యనాటక నిపుణులు. ‘గాన కోకిల’, ‘మధుర కంఠీరవ’గా బిరుదులు పొందినవారు. ఏడు పదుల వయసులోనూ రాముడుగా, కృష్ణుడుగా పౌరాణిక పాత్రలో రాణిస్తూ కళాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలో ఉంటున్న ఈ పద్య నాటక కళాకారుడు నేడు ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాటకరంగం గురించి, చేసిన విశేష సాధన గురించి ప్రస్తావించారు.

‘‘ఇప్పుడు నాకు డెబ్భైఆరేళ్లు. మొన్నటి ఉగాది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని రామానాయుడు కళామండపం లో జరిగిన వేదికపైన ప్రదర్శన ఇచ్చాను. శారీరకంగా కాస్త అలసటగా అనిపించినా, గొంతు మాత్రం పద్యంతో ఇంకా పదం తొక్కుతూనే ఉంది. ఇది ఆ రాముడు ఇచ్చిన శక్తే. అదే నన్ను ఇంకా సజీవంగా ఉంచుతోంది. 

వదలని ప్రేమ... జీవితాన్ని ప్రతిబింబించేది నాటకమైతే, నాటకానికి ప్రతిస్పందించేది జీవితమే. పదిహేనేళ్ల వయసులో మా పెదనాన్న కుమారుడు వల్లూరు కామేశ్వరరావు ద్వారా నాటకరంగంలోకి వచ్చాను. కంఠం బాగుందని, పద్యాలు పాడించి ప్రోత్సహించేవారు. ఆ విధంగా సతీ సక్కుబాయిలో ‘జ్ఞానయోగి’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఆ తర్వాత పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో సిద్ధయ్యగా రేణుకా మహత్యంలో ‘నారదుని’గా, కనకదుర్గ మహత్యంలో ‘శంకరుని’గా శ్రీరామాంజనేయ యుద్ధంలో ‘శ్రీరాముని’గా, కురుక్షేత్రం గయోపాఖ్యానంలో శ్రీకృష్ణునిగా, తులసి జలంధరలో ‘దేవేంద్రుని’గా, పాండవ సౌశీల్యంలో ధర్మరాజు’ గా సాయినాథ ప్రస్థానంలో ‘శ్యామా’గా... వివిధ రకాల పాత్రలను పోషించాను. పోషిస్తూనే ఉన్నాను. ఏ పాత్ర ప్రత్యేకత దానిది. పద్యాలను నుడికారాలతో సహా కంఠస్థం చేస్తూ గొంతును నాటకానికి మేటిగా మార్చుకున్నాను. రాముడిగా, కృష్ణుడిగా పాత్రలు పోషించేటప్పుడు ప్రేక్షకులు రాముడిగా భావించి, నాటకం పూర్తయ్యేక నమస్కరించేవారు. అది నాటకం ద్వారా రాముడే ఇచ్చిన గౌరవంగా భావిస్తాను. ఇప్పటికీ ప్రతిరోజూ పద్యాలు సాధన చేస్తూనే ఉంటాను. నాటి నుంచి నేటి వరకు ఏనాడూ ఈ కళను వదిలింది లేదు. నాకరంగంలో తెలుగు రాష్ట్రాలలో సీనియర్‌ రంగస్థల నటుడిగా గౌరవ పురస్కారాలు అందుకున్నాను.

తెల్లవార్లూ పాత్రలో లీనమై... రాత్రి ఎనిమిది గంటలకు నాటకం మొదలైతే తెల్లవారు ఝాము వరకు పాత్రలో జీవిస్తూనే ఉంటాం. సన్నివేశాలను బట్టి ఒక్కో నాటకానికి 40 పద్యాలపైనే ఉంటాయి. ప్రేక్షకులు కూడా తెల్లవార్లూ నాటకాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇప్పుడు డిజిటల్‌ టీవీలు వచ్చాక లైవ్‌ టెలీకాస్ట్‌లు కూడా ఇస్తున్నారు. దీనివల్ల ప్రదర్శనకు రాలేని, నాటకంపైన అభిమానం ఉన్న నాటి తరం వాళ్లు లైవ్‌లో చూస్తుంటారు.

పోషణకు మరో ఉపాధి... నేను నాటకంలో పాల్గొనాలంటే నాతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా రావాలి. ఒకరు హార్మోనిస్ట్, మరొకరు మేకప్‌ ఆర్టిస్ట్‌. నాటకరంగం ఊపిరిగా కొనసాగుతున్నా జీవనోపా«ధి, కుటుంబ పోషణ కోసం ప్రైవేట్‌గా ఉద్యోగాలూ చేశాను. నా చిన్నతనంలోనే మా అమ్మనాన్నలు చనిపోయారు. నా తరువాత ఐదుగురు చెల్లెళ్లు. పసిపిల్లలుగా ఉన్నవారిని పెంచి, పెద్ద చేసి, పెళ్ళిళ్లు జరిపించాను. ఇప్పడు అందరూ వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. నా భార్య సూర్యకుమారి. ఆమెకు నలుగురు చెల్లెళ్లు. మాకు ముగ్గురు పిల్లలు. పిల్లల చదువుల కోసం మా  స్వస్థలం కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చాం. ఇప్పుడు పిల్లలందరి బాధ్యతలు పూర్తయ్యి, విశ్రాంత జీవనంలో ఉన్నాం.

పెన్షన్‌ సదుపాయం లేదు... నేటికీ మన తెలుగు పండగలైన వినాయకచవితి, దసరా, సుబ్రహ్మణ్యషష్టి, ఉగాది, శ్రీరామనవమి.. వంటి వేడుకల సమయాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో వేదికల మీద నా ప్రతిభ చూపే అవకాశం నేటికీ లభిస్తున్నది. దీని ఆధారంగానే నా జీవనం గడుస్తుంది. కళాకారులకు ఇచ్చే పెన్షన్‌ సదుపాయం ప్రభుత్వం నుంచి ఏదీ అందడం లేదు. అయినా ఆ కళా రంగమే నాకు ఇంకా ఇంత ముద్దపెట్టి, ఆదుకుంటోంది. నాలాంటి కళాకారులు ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కళను బతికించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నాతో పాటు కళను నమ్ముకుని బతుకుతున్న నిరుపేద కళాకారుల కుటుంబాలు ఉన్నాయి. పద్యనాటక కళాకారులను ప్రోత్సహించి, వారు ప్రదర్శనల్లో పాల్గొనేలా నా వంతు సాయం చేస్తుంటాను’’ అంటూ తాను చేస్తున్న నాటక కళారాధన గురించి తెలియజేశారు ఈ కంఠీరవుడు.

– నిర్మలారెడ్డి 
సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు: గడిగె బాలస్వామి


వల్లూరు శ్రీహరి రావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement