
పదిహేడులోనైనా ప్రగతి ప్రభవించేనా!
కోటి ఆశలు..కొత్త కాంతులు..కొంగొత్త ఆలోచనలు.. మోసుకొస్తోంది 2017.
పాలకులు మనసు మారాలి
అభివృద్ధి పరుగులు పెట్టాలి
కోటి ఆశలు..కొత్త కాంతులు..కొంగొత్త ఆలోచనలు.. మోసుకొస్తోంది 2017. కొత్త ఏడాదిలోనైనా ఆశించిన విజయాలు అందుకోవాలని..అభివృద్ధిలో జిల్లా వాయువేగంతో పరుగు పెట్టాలని విశాఖ జిల్లా వాసులు ఎదురు చూస్తు న్నారు. గతేడాది మాదిరిగా హంగూ ఆర్భాటాలు.. శంకుస్థాపనల శిలాఫలకాలకు పరిమితం కాకుండా తలపెట్టిన ప్రతి కార్యక్రమం కార్యరూపం దాల్చాలని..వాటి ఫలితాలు అందుకోవాలని జిల్లా వాసులు కోటి ఆశలతో 2017కు ఘనంగా స్వాగతం చెబుతున్నారు.
గడిచిన రెండున్నరేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని పాలక పక్షాలు కొత్త ఏడాదిలోనైనా ప్రజలకు మేలుచేయాలని కోరుతున్నారు.పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్ తీసుకున్న కేంద్ర పెద్దలు వచ్చే ఏడాదిలోనైనా వారి మనసులు మారి రాష్ట్రానికి హోదా ఇవ్వాలని ఆశిస్తున్నారు. విభజన హామీల్లో ఒకటైన రైల్వేజోన్ ప్రకటన రానున్న కేంద్రబడ్జెట్ రోజైనా ప్రకటించాలని కోరుతున్నారు. ఇక ఊరించి ఊసురుమనిపించిన మెట్రోరైల్వేప్రాజెక్టు కొత్త సంవత్సరంలోనైనా పట్టాలెక్కేలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతేడాది విశాఖ కేంద్రంగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో చేసుకున్న రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడుల్లో కనీసం పదోశాతమైనా వచ్చే ఏడాది కార్యరూపం దాల్చాలని.. తద్వారా తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. మరో పక్క టాప్–20లో చోటు దక్కించుకుని స్మార్ట్సిటీగా ఎంపికైన విశాఖలో గతేడాది పూర్తిగా డీపీఆర్ల తయారీ, శంకుస్థాపనలకే పరిమితమైన స్మార్ట్సిటీ ప్రాజెక్టులు వచ్చే ఏడాదైనా పట్టాలెక్కాలని కోరుతున్నారు.
శంకుస్థాపనకు పరిమితమైన ఐఎఎం, పెట్రోయూనివర్శిటీ, అంకురం, ఈఎస్ఐ ఆస్పత్రి, జాతీయ మౌలికసదుపాయాల శిక్షణా సంస్థ, ఇన్క్యూబేషన్ సెంటర్లతో సిగ్నేచర్ టవర్స్వంటి జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన వివిధ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నారు. గతేడాది శంకుస్థాపన చేసి పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం వచ్చే ఏడాదిలో పూర్తయి గోదావరి నీళ్లు విశాఖకు పరుగులు తీయాలని..తద్వారా సాగులోలేని ఆరున్నరలక్షల హెక్టార్ల వ్యవసాయ భూములు సైతం సాగులోకివచ్చి జిల్లా సశ్యశ్యామలంగా సుభిక్షం కావాలని కోరుతున్నారు. –సాక్షి, విశాఖపట్నం