గ్రానైట్‌ను ఎలా తరలిస్తారు..? | ranite bodikonda truck blocking public groups | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ను ఎలా తరలిస్తారు..?

Jul 9 2016 1:28 AM | Updated on Apr 3 2019 5:32 PM

మండలంలోని టేకులోవ సమీపంలో ఉన్న బోడికొండపై వివాదం నడుస్తుండగా గ్రానైట్ తరలించడంపై ప్రజా సంఘాలు మండిపడ్డాయి...

బోడికొండ గ్రానైట్ లారీని అడ్డుకున్న ప్రజా సంఘాలు
* ఎస్సై జోక్యంతో వెనక్కి మళ్లిన లారీ

పార్వతీపురం రూరల్: మండలంలోని టేకులోవ సమీపంలో ఉన్న బోడికొండపై వివాదం నడుస్తుండగా గ్రానైట్ తరలించడంపై ప్రజా సంఘాలు మండిపడ్డాయి. బోడికొండ నుంచి గ్రానైట్ తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు మండలంలోని పులిగుమ్మి సమీపంలో లారీని శుక్రవారం అడ్డుకున్నారుు. దీంతో క్వారీ సూపర్‌వైజర్ మహేష్ తమకు అనుమతులు ఉన్నాయని, అందుకే గ్రానైట్ తరలిస్తున్నామని చెప్పడంతో ప్రజా సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రానైట్ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేశామని, అలాంటి సమయంలో ఎలా తరలిస్తారని నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి, పాలక రంజిత్‌కుమార్, పోల రమణి, పి.  రాజశేఖర్, తదితరులు ప్రశ్నించారు. తరలింపు ఆపకపోతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న రూరల్  ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను వారించి గ్రానైట్ లారీని మళ్లీ  వెనక్కి మళ్లించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి గ్రానైట్ తవ్వకాలు నిలుపుదల చేయూలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
 
కార్యాచరణ సిద్ధం..
పార్వతీపురం: బోడికొండపై గ్రానైట్ తవ్వకాలపై సాగుతున్న పోరాటానికి సంబంధించి ఆందోళనకారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఐక్య సంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు బోడికొండ పనులు అడ్డుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను ప్రకటించారు. దీనిలో భాగంగా ఈ నెల  9,10 తేదీలలో ఐక్య సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా బోడికొండ ప్రాంతంలో ఉన్న పంచాయతీ గ్రామాల్లో పర్యటించి ప్రజలను ఆందోళనకు సన్నద్ధం చేయాలి.

11న ఐక్య సంఘాలు ఉమ్మడిగా గ్రామాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ను కలిసి బోడికొండ సమస్యపై నివేదించాలి. 12న బుదురువాడ పంచాయతీ  బొడ్డవలసలో అన్ని గ్రామాల ప్రజలతో విస్తృత సమావేశం నిర్వహించి భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్ణయించాలని తీర్మానించారు. కార్యక్రమంలో  రెడ్డి శ్రీరామమూర్తి(వ్యవసాయ కార్మిక సంఘం), పి.రమణి, వెలగాడ కృష్ణ, పి.మల్లిక్, (అఖిల భారత రైతు కూలీ సంఘం), పి.రంజిత్ కుమార్, టి.సాయిబాబు(గిరిజన సంక్షేమ సంఘం), కె.రామస్వామి (ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం) నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement