అనంతలో ర్యాగింగ్‌ కలకలం | ragging in anantapur | Sakshi
Sakshi News home page

అనంతలో ర్యాగింగ్‌ కలకలం

Aug 2 2017 10:50 PM | Updated on Nov 9 2018 4:36 PM

అనంతలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. ఒకేరోజు ఇద్దరు విద్యార్థులు ర్యాగింగ్‌ బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

– ఎస్కేయూలో ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని
– పీవీకేకేలో విద్యార్థికి గొంతుకోసిన దుండగలు

అనంతపురం సెంట్రల్‌: అనంతలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. ఒకేరోజు ఇద్దరు విద్యార్థులు ర్యాగింగ్‌ బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సైన్స్‌ కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ తొలి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థులు గమనించి అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. మహిళా వసతి గృహాల్లో రాత్రి పూట ర్యాగింగ్‌ తీవ్రంగా జరుగుతోందని, క్యూలైన్‌లోనే వెళ్లాలని, తప్పితే రాత్రి పూట చిత్ర విచిత్రాలతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాధితురాలు వాపోయారు.

అదేవిధంగా మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి చెందిన పీవీకేకే కళాశాలలో ర్యాగింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న నితీష్‌కుమార్‌రెడ్డి గొంతుకోసి దుండగులు పరారయ్యారు. మంగళవారం సాయంత్రం కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థి కళాశాలకు కూతవేట దూరంలోని ముళ్ల పొదల్లో రక్తపుమడుగులో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం చేరవేయడంతో బాధితున్ని మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారు. అయితే బాధిత విద్యార్థి సదరు కళాశాలలో చదువుకోలేనని.. ర్యాగింగ్‌తో పాటు, తాగి వస్తున్నారని ముందు రోజు తల్లిదండ్రులకు తెలియజేసినట్లు బంధువులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement