‘మూగనోము’ వదిలేదెన్నడు..? | police phones not worked | Sakshi
Sakshi News home page

‘మూగనోము’ వదిలేదెన్నడు..?

Sep 21 2016 10:56 PM | Updated on Aug 21 2018 5:54 PM

పోలీసులు, ప్రజల మధ్య సంబంధాలు సన్నగిల్లిపోతున్నాయి. పోలీసు శాఖలో సమాచార వ్యవస్థ చిన్నాభిన్నంగా తయారైంది.

♦  పనిచేయని పోలీసుల సెల్‌ఫోన్లపై స్పందన కరువు
♦  తాజాగా 30 మంది పోలీసు అధికారుల సెల్‌ఫోన్లు కట్‌
♦  ఎస్పీ దష్టి సారిస్తేనే సమస్యకు పరిష్కారం  

అనంతపురం సెంట్రల్‌ : పోలీసులు, ప్రజల మధ్య సంబంధాలు సన్నగిల్లిపోతున్నాయి. పోలీసు శాఖలో సమాచార వ్యవస్థ చిన్నాభిన్నంగా తయారైంది. ఎవరి సెల్‌ఫోన్లు ఎప్పుడు ఆగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా తాజాగా 30 మంది పోలీసు అధికారుల సెల్‌ఫోన్లు ఆగిపోయాయి. ప్రతి నెలా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. పోలీసు శాఖలో ఎంపిక చేసిన కానిస్టేబుల్స్‌ నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకూ పోస్టుపెయిడ్‌ (నెలవారి చెల్లింపు) గ్రూప్‌ సిమ్‌(సీయూజీ)లను అందజేశారు. సదరు నంబర్లు గ్రామాలు, ఆయా ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చేశాయి.

ఎక్కడైనా చిన్న గొడవ జరిగినా వెంటనే పోలీసు అధికారులకు ఫోన్‌చేసి ప్రజలు తెలియజేస్తున్నారు. అలాంటి ఫోన్‌ నంబర్‌లను 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ నెలవారి బిల్లులు చెల్లించకపోతుండడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు సేవలు నిలిపివేస్తున్నారు.

తాజాగా అనంతపురం వన్‌టౌన్, శింగనమల, ఇటుకలపల్లి, నార్పల, ఉరవకొండ, తలుపుల, తనకల్లు, కళ్యాణదుర్గం టౌన్, రూరల్, శెట్టూరు, కుందిర్పి, కంబదూరు, బ్రహ్మసముద్రం, బెళుగుప్ప, డీ. హీరేహాల్, బొమ్మనహాల్, గుమ్మఘట్ట, లేపాక్షి, పెద్దపప్పూరు, తాడిపత్రి అర్బన్, తాడిపత్రి రూరల్‌తో పాటు పలువురు ఐటీ కోర్‌టీం అధికారుల సెల్‌ఫోన్లు మూగబోయాయి. ఎక్కువశాతం మండల సబ్‌ ఇన్‌స్పెక్టర్ల సెల్‌ఫోన్లు కట్‌ చేయడంతో ఆయా మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాజంలో శాంతిభద్రతలు అదుపుచేయడానికి కీలకమైన పోలీస్‌శాఖలో సమాచార వ్యవస్థ పటిష్టం చేయడంపై జిల్లా ఎస్పీ దష్టి సారించాలని ఆశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement