తెలంగాణలో రైతులు ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ నేతలు కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
హైదరాబాద్ : తెలంగాణలో రైతులు ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ నేతలు కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో 97మంది రైతులు మాత్రమే చనిపోయారని పార్లమెంట్లో టీఆర్ఎస్ తప్పుదోవ పట్టించిందని వారు సోమవారమిక్కడ విమర్శించారు. టీఆర్ఎస్ దొంగలెక్కలు చెప్పిందనడానికి కేంద్రానికి పంపిన నివేదికే నిదర్శనమని కోదండరెడ్డి, శ్రవణ్ అన్నారు.
ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులను ఆదుకునేందుకు 420 జీవోను అమలు చేయకపోవడం దారుణమని, మానవత్వం లేని రాక్షసత్వ ప్రభుత్వమని టీపీసీసీ నేతలు ధ్వజమెత్తారు. 1007మంది రైతుల ఆత్మహత్యల వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నామని, విచారణ జరిపి ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. తెలంగాణ రైతు సమస్యలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.