విహారయాత్రలో విషాదం | One died and 3 injured in road accident | Sakshi
Sakshi News home page

విహారయాత్రలో విషాదం

Jun 20 2016 8:08 PM | Updated on Apr 3 2019 7:53 PM

నలుగురు స్నేహితులు కలిసి వెళ్లిన విహార యాత్ర విషాదాంతమైంది. కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడటంతో పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

- రాయిచూర్ సమీపంలో కారు బోల్తా
- పెద్దమంగళారం యువకుడి దుర్మరణం
- మరో ముగ్గురికి తీవ్రగాయాలు


మొయినాబాద్ (రంగారెడ్డి) : నలుగురు స్నేహితులు కలిసి వెళ్లిన విహార యాత్ర విషాదాంతమైంది. కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడటంతో పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

స్థానికులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండంలోని పెద్దమంగళారానికి చెందిన పాటి సత్యనారాయణరెడ్డి(23), శ్రీరాంనగర్ నివాసి జంగం సన్నీ, చేవెళ్ల మండలం పలుగుట్ట గ్రామస్తులు శ్రీరాం రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డిలు స్నేహితులు. వీరంతా కలిసి ఆదివారం మధ్యాహ్నం మారుతీ జెన్ కారులో విహారయాత్రకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ సమీపంలో వీరి కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కడీలను ఢీకొని బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో పెద్దమంగళారం గ్రామానికి చెందిన పాటి సత్యనారాయణరెడ్డి తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో సన్నీ పరిస్థితి విషమంగా ఉంది. సత్యనారాయణ రెడ్డి మృతితో కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.  సత్యనారాయణరెడ్డి మొయినాబాద్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement