నవంబర్‌కు కొత్త టెర్మినల్ సిద్ధం చేయండి | New Terminal in GANNAVARAM Airport | Sakshi
Sakshi News home page

నవంబర్‌కు కొత్త టెర్మినల్ సిద్ధం చేయండి

Aug 19 2016 7:35 PM | Updated on Aug 20 2018 5:08 PM

గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్‌ను నవంబర్‌కల్లా సిద్ధం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఆదేశించారు.

గన్నవరం ఎయిర్‌పోర్టులో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్‌ను నవంబర్‌కల్లా సిద్ధం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఆదేశించినట్లు గన్నవరం ఎయిర్‌పోర్టు డెరైక్టర్ జి.మధుసూదనరావు ‘సాక్షి’కి తెలిపారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా గురువారం విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి ఎయిర్‌పోర్టులో నిర్మిస్తున్న ఇంటీరియమ్ టెర్మినల్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.
 
రూ. 137 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ టెర్మినల్‌ను లక్ష్యం కంటే ముందుగా పూర్తి చేయాలని మంత్రి కోరినట్లు తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ఈ టెర్మినల్‌ను 15 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంది. పనులు వేగంగా నడుస్తున్నాయని, నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ నాటికి టెర్మినల్ అందుబాటులోకి వస్తుందన్న ధీమాను డెరైక్టర్ వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం ఎయిర్‌కోస్టా మొదటి రోజు నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతుండగా, ట్రూ జెట్ చివరి వారం రోజులకు అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు.
 
ఎయిర్ ఇండియా మాత్రం డిమాండ్ అధికంగా ఉన్న సమయాల్లో రెండు అదనపు సర్వీసులు నడిపినట్లు తెలిపారు. పుష్కరాల సందర్భంగా ఎంతమంది అదనంగా విమాన సేవలను వినియోగించుకున్నారన్న లెక్కలు నెలాఖరుకు కానీ అందుబాటులోకి రావన్నారు. గోదావరి పుష్కరాలతో పోలిస్తే అదనపు సర్వీసులు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటికే విజయవాడకు అన్ని ప్రధాన పట్టణాల నుంచి ఎయిర్ కనెక్టివిటీ ఉండటంతో అదనపు సర్వీసులు తగ్గడానికి ప్రధాన కారణంగా ఆయన వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement