గర్భస్థ శిశువుకు ఆధునిక వైద్యం
గర్భస్థ శిశువుకు ఉండే లోపాలను ఆధునిక వైద్యం ద్వారా నయం చేయవచ్చని ఫీటల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ గాయత్రి ఇండ్ల చెప్పారు.
కర్నూలు(హాస్పిటల్): గర్భస్థ శిశువుకు ఉండే లోపాలను ఆధునిక వైద్యం ద్వారా నయం చేయవచ్చని ఫీటల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ గాయత్రి ఇండ్ల చెప్పారు. ఫాగ్సీ కర్నూలు, లోటస్ అల్ట్రాసౌండ్, ఫీటల్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఓ హోటల్లో గర్భస్థ శిశువు లోపాలపై వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గాయత్రి ఇండ్ల మాట్లాడుతూ స్కానింగ్, స్క్రీనింగ్ ద్వారా జన్యులోపాలను, ఇతర అవయవలోపాలను, బిడ్డ ఎదుగుదలను గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. గర్భస్థ శిశువుకు సైతం మల్టీస్పెషాలిటీ స్థాయిలో కేర్ అవసరమన్నారు. ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, గైనకాలజిస్టు, పీడియాట్రిస్ట్, పీడియాట్రిక్ సర్జన్లు కలిసి గర్భస్థ శిశువుకు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందన్నారు. ఇదే అంశంపై డాక్టర్ ఉమారామ్(చెన్నై), డాక్టర్ చిన్మయి, డాక్టర్ అమిత(హైదరాబాద్) ప్రసంగించారు. కార్యక్రమంలో ఫాగ్సీ సెక్రటరీ డాక్టర్ మాణిక్యరావు, చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ చలపతి, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ నవీద్ తదితరులు పాల్గొన్నారు.