పశ్చిమగోదావరి జిల్లా: రెండు చెవులు లేని శిశువు జననం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సంచలనం కలిగించగా.. స్కానింగ్ రిపోర్టులో వైకల్యం గుర్తించలేదంటూ బాధితులు సదరు సెంటర్ వద్ద ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన మహిళ తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఏప్రిల్ 28న ఆడ శిశువుకు జన్మనిచి్చంది. అయితే శిశువుకు రెండు చెవులు లేకపోవడంతో వైద్యవర్గాలు ఖంగుతిన్నాయి. బాధిత మహిళ మొదటి నుంచి తణుకులోని వేద హాస్పిటల్లో చూపించుకుని స్థానికంగా వేవ్ స్కానింగ్ సెంటర్లో మూడుసార్లు స్కానింగ్ చేయించుకున్నారు.
అవయవ లోపాలను గుర్తించే టిఫా స్కానింగ్ కూడా అక్కడే చేశారు. అయితే స్కానింగ్ సెంటర్ వైద్యుడు మాత్రం లోపం లేనట్టుగా రిపోర్టులు ఇచ్చారు. ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకోలేక తణుకు జిల్లా ఆస్పత్రిలో చేరారు. ప్రసవం అనంతరం శిశువును చూసిన బాధితులు ఆవేదనతో గురువారం వేద హాస్పిటల్, వేవ్ స్కానింగ్ సెంటర్లకు వెళ్లి ఆందోళన చేశారు. పోలీసులు, స్థానికులు సర్దిచెప్పడంతో పరిస్థితి చక్కబడింది. శిశువును మెరుగైన వైద్యసేవల కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూలి పనులు చేసుకుని బతికే తమ కుటుంబం వైకల్యం ఉన్న శిశువును ఎలా సాకాలంటూ శిశువు తల్లిదండ్రులు బోరుమంటున్నారు.


