మోదుగుల ఇల్లు, కార్యాలయంపై ఐటీ దాడులు | MLA modugula Venugopal Reddy house in IT attacks | Sakshi
Sakshi News home page

మోదుగుల ఇల్లు, కార్యాలయంపై ఐటీ దాడులు

Sep 28 2016 6:57 AM | Updated on Sep 27 2018 4:07 PM

మోదుగుల ఇల్లు, కార్యాలయంపై ఐటీ దాడులు - Sakshi

మోదుగుల ఇల్లు, కార్యాలయంపై ఐటీ దాడులు

టీడీపీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆస్తులపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు చేశారు.

బెంగళూరు ఆఫీస్‌లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
 
గుంటూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆస్తులపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు చేశారు. బెంగళూరులోని ఆయన నివాసంతో పాటు కార్యాలయాలపై ఐటీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఐటీ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి మధ్యాహ్నం నుంచి సోదాలు చేశారు.
 
కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా బెంగళూరులోని ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీల్లో అవకతవకలు గుర్తించినట్లు సమాచారం.
 
బుధవారం మోదుగులకు చెందిన హైదరాబాద్, గుంటూరు కార్యాలయాల్లో కూడా ఈ దాడులు నిర్వహించనున్నట్లు తెలిసింది. మోదుగుల బెంగళూరులో అందుబాటులో లేని సమయంలో ఈ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయా, లేక రాజకీయకోణంలో జరిగాయా అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. మోదుగుల అందుబాటులో లేకపోవడంతో ఐటీ అధికారులు ఆయన భార్య వద్ద నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement