జగం మెచ్చిన దర్శకుడు - జనానికి దార్శనికుడు
రాజమహేంద్రవరం కల్చరల్ : ‘సిరిమువ్వల’ సడి తెలసిన ‘స్వాతిముత్య’మితడు - ‘సిరివెన్నెల’ నొడిదాచిన ‘స్వర్ణకమల’మితడు - ‘స్వయంకృషి’ని గౌరవించు ‘సూత్రధారి’ ఇతడు - చైతన్యపు ‘సప్తపది’కి
‘ఆపద్భాంధ
కళాతపస్వి కె.విశ్వనాథ్కు సువర్ణఘంటా సత్కారం
తరలివచ్చిన ప్రముఖులు
రాజమహేంద్రవరం కల్చరల్ : ‘సిరిమువ్వల’ సడి తెలసిన ‘స్వాతిముత్య’మితడు - ‘సిరివెన్నెల’ నొడిదాచిన ‘స్వర్ణకమల’మితడు - ‘స్వయంకృషి’ని గౌరవించు ‘సూత్రధారి’ ఇతడు - చైతన్యపు ‘సప్తపది’కి
‘ఆపద్భాంధవు’డితడు - ‘శృతిలయ కలసిన ‘సాగరసంగ’మితడు - శాశ్వతమై నిలుచు ‘శంకరాభరణ’మితడు....అని దర్శకుడు కె.విశ్వనాథ్పై ఆంగ్ల అధ్యాపకుడు నూజిళ్ల శ్రీనివాస్ కవిత చదివారు. నవరస నటసమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఆనం కళాకేంద్రంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళాతపస్వి కాశీ విశ్వనాథునికి సువర్ణఘంటా సత్కారం జరిగింది. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శిఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం విశ్వనాథ్కు సువర్ణ కంకణాన్ని తొడిగారు. ముందుగా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలలోని పాటలను తెరపై ప్రదర్శించారు. డాక్టర్ ఎస్వీ రామారావు ఆయా పాటల నేపథ్యాన్ని వివరించారు. అనంతరం నర్తనబాల పురస్కార గ్రహీత షైలిక పాత్రో నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నగరప్రముఖుడు దాట్ల బుచ్చి వెంకటపతిరాజు జ్యోతిప్రకాశనంతో సన్మాన కార్యక్రమం ప్రారంభమైంది.
సాంస్కృతిక పునరుజ్జీవనం
మరుగున పడుతున్న సాంస్కృతిక వైభవాన్ని చలనచిత్రాల ద్వారా పునరుజ్జీవింపచేసిన మహనీయుడు విశ్వనాథ్ అని ఘంటసాల ఆరాధన కమిటీ సభ్యుడు దుర్భా శ్రీరామమూర్తి అన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు జిత్మోహన్ మిత్రా మాట్లాడుతూ విశ్వనాథ్ను ఈ గడ్డపై సత్కరించుకోవడం మన అదృష్టమన్నారు, ముగ్గురు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు బీఎస్ రెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, ఇప్పుడు కె.విశ్వనాథ్లను సత్కరించుకునే భాగ్యం ఈ నగరవాసులకు దక్కిందన్నారు.
మేళాతాళాలతో..
ముందుగా దర్శకుడు కె.విశ్వనాథ్ను మేళతాళాలతో వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఆయన ఆడిటోరియంలోకి ప్రవేశించగానే సభలో ఉన్న ప్రతిఒక్కరూ గౌరవ పురస్కారంగా లేచి నిలబడ్డారు. పలువురు విశ్వనాథ్కు పాదాభివందనం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, వైఎస్సార్ సీపీ నాయకుడు కందుల దుర్గేష్, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పాల్గొన్నారు.