కేంద్రం సీమాంధ్రను దగా చేయాలనుకుంటే సహించేదిలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి హెచ్చరించారు.
కేంద్రం సీమాంధ్రను దగా చేయాలనుకుంటే సహించేదిలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి హెచ్చరించారు. ఆదివారం గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం జరిగిన మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన విధానాన్ని మొట్టమొదటిసారిగా తెరమీదకు తెచ్చింది బీజేపీయేనన్నారు. కాకినాడ సభలో ఒక ఓటు... రెండు రాష్ట్రాల ప్రతిపాదన చేసింది ఆ పార్టీయేనని, విభజన సమయంలో రాజ్యసభలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిందని గుర్తుచేశారు.
వార్డు మెంబర్గా కూడా గెలవని సోము వీర్రాజును ఎమ్మెల్సీని చేస్తే కనీసం మిత్రధర్మాన్ని పాటించకుండా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మిడిమిడి జ్ఞానంతో అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. వైజాగ్లో హుద్హుద్ తుపాను సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించి వెయ్యి కోట్లు ప్రకటిస్తే ఇచ్చింది కేవలం రూ. 535 కోట్లు మాత్రమేనన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు, ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత బీజేపీపైనే ఉందన్నారు.