స్వర్ణ ప్రాజెక్టు గేట్లు, కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఈ ఖరీఫ్లో రైతులకు శాపంగా మారిందని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఎలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు.
-
డీసీసీ అధ్యక్షుడు ఎలేటి మహేశ్వర్రెడ్డి
సారంగాపూర్ : స్వర్ణ ప్రాజెక్టు గేట్లు, కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఈ ఖరీఫ్లో రైతులకు శాపంగా మారిందని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఎలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును ఆదివారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు రెండుకోట్ల రూపాయల నిధులు మంజూరు వచ్చినా ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టరు వాటికి పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టకపోవడంతో గేట్లు మొరాయింపు మొదలు పెట్టాయన్నారు.
ఇటీవల వరదగేటును ఎత్తి దింపే క్రమంలో అది సక్రమంగా కూర్చోక విలువైన సేద్యపు నీరు వథా అయ్యిందన్నారు. దీంతో పాటు గేట్ల లీకేజీలు సైతం యథాతథంగా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే సోమవారం వరకు ప్రాజెక్టు గేట్లకు, కాలువలకు మరమ్మతులు చేపట్టి నీరు విడుదల చేయని పక్షంలో వచ్చే సోమవారం 10వేలమంది రైతులతో కలిసి స్వర్ణ ప్రాజెక్టునుంచి పాదయాత్ర చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వంగ లింగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దశరథరాజేశ్వర్, స్వర్ణ ప్రాజెక్టు ఆయకట్టు మాజీ అధ్యక్షుడు ఓలాత్రి నారాయణరెడ్డి, నాయకులు బడిపోతన్న, తోట భోజన్న, నక్క రాజన్న, తదితరులు ఉన్నారు.