తడారితే అలారం మోగుద్ది.. | Experiment with rural young man | Sakshi
Sakshi News home page

తడారితే అలారం మోగుద్ది..

Jul 18 2015 11:57 PM | Updated on Oct 22 2018 8:25 PM

ఇంజనీరింగ్ లాంటి పెద్ద చదువులు చదవకపోయినా ఉపాధికోసం ఎంచుకున్న రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు మోత్కూరు

ఓ పల్లెటూరి యువకుడి ప్రయోగం
 ఇంజనీరింగ్ లాంటి పెద్ద చదువులు చదవకపోయినా ఉపాధికోసం ఎంచుకున్న రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు మోత్కూరు మండల ఆజీంపేట గ్రామానికి చెందిన  బొమ్మగాని మల్లేష్. తక్కువ ఖర్చుతో రైతులకు ఉపయోగపడే పలు రకాల సోలార్ పరికరాలను రూపొందిస్తున్నాడు. మొక్కలకు తడారిపోతే అలారం మోగే పరికరాన్ని తయారు చేసి ప్రదర్శించాడు. పరికరం విశిష్టత..పనిచేసే విధానం, తయారీపై కథనమే ఈవారం సండేస్పెషల్.
 
 మోత్కూరు మండలం ఆజీంపేట గ్రామానికి చెందిన బొమ్మగాని మల్లేష్ మొక్కకు పదును ఆరిపోవడంతో అలారం లాంటి శద్దం వచ్చే పరికరాన్ని తయారుచేశాడు. గతంలో ఎలక్ట్రానిక్ పరికరాలతో సోలార్‌తో నడిచే పలు రకాల పరికరాలను తయారు చేసి అవార్డులు అందుకున్నాడు.
 
 ఈ పరికరాల రూపకల్పనకు అతని అమ్మే ప్రేరణ.
 మల్లేష్ తండ్రి వెంకటయ్య, తల్లి లక్ష్మి వ్యవసాయకూలీ. పనిచేస్తేనే ఆ కుటుంబం గడుస్తుంది. ఆర్థిక స్తోమతలేక మల్లేష్ 10వ తరగతి వరకు చదువుకు స్వస్తిచెప్పాడు. స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్‌లో సోలార్‌కోర్సు పూర్తిచేశాడు.  తల్లి లక్ష్మీ తరుచూ అనారోగ్యంతో బాధపడుతుంటుంది. ఒకరోజు తల్లి అనారోగ్యంతో బాధపడుతూ లేచి స్విచ్‌బోర్డు వద్దకు వెల్లిలైటు వేయడానికి, ఆర్పడానికి పడుతున్న బాధను చూడలేకపోయాడు. ఇనిస్టిట్యూట్‌లో పొందిన శిక్షణతో మల్లేష్ నిత్యం ఏదో ఒక్క కొత్త వస్తువును తయారుచేయాలన్న తపనతో ప్రయోగాలు చేశాడు. అందులో ఒకటి సోలార్‌తో నడిచే అలారం.
 
 పనిచేసే విధానం..
 మల్లేష్ రూపొందించిన సర్క్యూట్‌ను మొక్కల పెంపకం చేపట్టిన ఆవరణలో ఒకచోట ఏర్పాటు చేయాలి. సర్క్యూట్ నుంచి కనెక్షన్ ఇచ్చిన వైర్లు మొక్క వద్ద భూమిలో పెట్టాలి. అక్కడ తేమ లేకుండా ఎండిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా అలారం శబ్దం వస్తూ మొక్కకు కేటాయించిన నంబర్‌గల బల్బు వెలుగుతుంది. వెంటనే మొక్క వద్ద నీరు పోయగానే భూమిలో పదును ఏర్పడి ఆటోమేటిక్‌గా ఆ శబ్దం ఆగిపోతూ, బల్బు ఆఫ్ అవుతుంది. ఇలా మొక్కకు నీరు ఎంత అవసరం ఉంటుందో, అవరసరం ఉండి ఎంతో తేమలేకుండా ఆరిపోతుందో విషయాన్ని తెలుసుకోవచ్చు.  దీని ద్వారా మొక్క ఎండిపోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడి పెంపకంలో తగు చర్యలు తీసుకోవచ్చు.
 
 పరికరం తయారు చేసింది ఇలా..
 10 వాట్స్‌గల  ఒక సోలార్ ప్యానల్, 12 ఓల్టేజీ గల రెండు బ్యాటరీలు, 5 ట్రాన్సిస్టర్లు, 2 ఐసీలు, 5 రిలేలు, 3 కెపాసిటర్లు, 10 డైమోడ్స్, 12 రిసిస్ట్రర్స్‌లతో అలారం మోగే సర్క్యూట్‌ను రూపొందించాడు. ఈ సర్క్యూట్ వద్ద నుంచి తీసిన వైర్లు మొక్క గుంత వద్ద మట్టిలో పెట్టాలి. ఈ మొక్క వద్ద పదును ఆరిపోగానే అలారం మోగి గుర్తుచేస్తుంది. 1 నుంచి 4 మొక్కలకోసం ఏర్పాటు చేసిన సర్క్యూట్‌కు రూ. 1500 వరకు ఖర్చు అవుతుంది. 500 నుంచి 1000 మొక్కల వరకు ఏర్పాటుచేసే సర్క్యూట్‌కు రూ. 6వేలు ఖర్చు అవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement