గౌరిగోపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాడాల సూర్యనారాయణరావు
పోస్టల్ శాఖలో ఆయన ఓ కింది స్థాయి అధికారి. పోస్టల్ ఉన్నతాధికారి మొప్పు కోసం అడ్డుగోలుగా అప్పులు చేశారు.
- ఉన్నతాధికారి సేవలో తరిస్తూ ఉన్నదంత పొగొట్టుకున్న పోస్టల్ అధికారి
- దిక్కుతోచక ఆఫీసులోనే ఆత్మహత్యాయత్నం
- చావుబతుకుల మధ్య పోరాటం
కర్నూలు(అగ్రికల్చర్): పోస్టల్ శాఖలో ఆయన ఓ కింది స్థాయి అధికారి. పోస్టల్ ఉన్నతాధికారి మొప్పు కోసం అడ్డుగోలుగా అప్పులు చేశారు. ఉన్నతాధికారికి భారీ ఎత్తున సన్మానాలు, ఊరేగింపులు చేయించారు. చివరికి అప్పుల బాధ తాళలేక కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఈనెల 8వ తేదీ జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బిర్లాగేటు దగ్గర ఉన్న దక్షిణ మండలం పోస్టల్ కార్యాలయంలోని బి.క్యాంపు పోస్టాఫీసులో సూర్యనారాయణరావు పోస్టు మాస్టర్గా పని చేస్తున్నారు. పోస్టల్ ఉన్నతాధికారికి నమ్మినబంటులా ఉండేవారు. మంత్రాలయంలో పని చేస్తుండగా అక్కడి నుంచి జిల్లా ఉన్నతాధికారి అండతో బి.క్యాంపు పోస్టు మాస్టర్గా బదిలీ అయ్యారు.
అధికారి మొప్పు కోసం నానా తంటాలు పడ్డారు. ఆయన గ్రామాలకు వస్తున్నారంటే చాలు అట్టహాసంగా సన్మానాలు, ఊరేగింపులు ఏర్పాటు చేసేవారు. ఇందుకోసం అడ్డుగోలుగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. కోరుకున్న స్థానాలకు బదిలీ చేయిస్తామని అనేక మందితో డబ్బులు వసూలు చేసి ఆ అధికారికి సమర్పించినట్లు సమాచారం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి ఆ అధికారికి ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే అందరికి కోరుకున్న స్థానాలకు బదిలీ కాకపోవడం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు దక్కకపోవడంతో ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలనే ఒత్తిళ్లు ఎక్కువైనట్లు సమాచారం.
అన్ని విధాలా ఉపయోగించుకున్న అధికారి చివరికి పట్టించుకోకపోవడం.. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో సూర్యనారాయణ రావు ఈ నెల 8న ఆఫీసులోనే థిమెట్ గుళికలు తిని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అక్కడ థిమెట్ గుళికలు తిని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా ఎంఎల్సీ అయింది. పెద్దాసుపత్రిలో చికిత్స చేయిస్తే బయటికి పొక్కుతుందనే భయంతో తర్వాత గౌరిగోపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆక్కడ ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.