కమిషనర్ల బృందం మన్యం పర్యటన
ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో శుక్రవారం పలు రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్లు కాఫీ తోటలు, చెరువులను పరిశీలించారు.
అరకులోయ: ఏజెన్సీ 11 మండలాల్లో 65 వేల ఎకరాల్లో కాఫీ పెంపకం జరుగుతోందని, తద్వారా 65వేల కుటుంబాలు స్థిర ఆదాయం పొందుతున్నాయని గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. కాఫీబోర్డు, ఎన్ఆర్ఈజీఎస్, ఐటీడీఏ ద్వారా సాగు చేపడుతున్నామన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో శుక్రవారం పలు రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్లు కాఫీ తోటలు, చెరువులను పరిశీలించారు. కమిషనర్ల బృందానికి పాడేరు ఐటీడీఏ ఇన్చార్జీ పీవో శివశంకర్, డ్వామా పీడీ కళ్యాణ్ చక్రవర్తి గిరిజన సంప్రదాయ థింసా నృత్యాలతో సుంకరమెట్ట పంచాయతీ గేటు వలస గ్రామంలో ఘన స్వాగతం పలికారు. పెదలగంగగ్గుడిలోని గిరిరైతుల కాఫీ తోటలు, గద్యగుడ గ్రామంలోని చెరువు, యూత్ ట్రయినింగ్ సెంటర్లో(వైటీసీ) నిర్మించిన రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ను కమిషనర్లు పరిశీలించారు. రామాంజనేయులు మాట్లాడుతూ భూగర్భజలాలు పెంపొందించేందుకు గత ఏడాది రూ. 2వేల కోట్లు కేటాయించామన్నారు. ఈ ఏడాది ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ. 1754 కోట్లు, ఇతర శాఖ ద్వారా రూ. రూ. 1754 కోట్లు కేటాయించి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యటనలో 10 రాష్ట్రాల గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్లు, డ్వామా సిబ్బంది, ఇంజినీరింగ్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అరకులోయ సీఐ సింహాద్రినాయుడు పర్యవేక్షణలో ఎస్ఐ సింహాచలం బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉపాధి కూలీలతో మాటామంతి
అనంతగిరి: మండలంలో టోకూరు పంచాయతీ కేంద్రంలో ఉపాధి హామీ కూలీలతో ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర బృందం ముచ్చటించింది. అరకు పర్యటన అనంతరం వారు టోకూరు చేరుకున్నారు. గ్రామంలో ఉపాధి హామీ పథకంలో మరుగుదొడ్లు నిర్మించుకున్నామని గ్రామస్తులు బృంద సభ్యులకు తెలిపారు. ఉపాధి పనులతో ఆర్థికంగా వృద్ధి చెందామన్నారు. వారంతా గ్రామస్తులు నిర్మించుకున్న మరుగుదొడ్లు పరిశీలించారు. కార్యక్రమంలో బృంద సభ్యులు సునిల్ పటేల్, రగురాజ్ రాహుల్, ఎంపీడీవో రమేష్రామన్, ఏపీవో రమణతల్లి తదితరులు పాల్గొన్నారు.
బొర్రా అందాలు అద్భుతం
బొర్రా గుహలను 10 రాష్ట్రాలకు చెందిన కమిషనర్ల బృందం శుక్రవారం సందర్శించింది. గుహల విశిష్టతను బృంద సభ్యులకు గైడ్లు వివరించారు. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలను చూసి వారు అద్భుతంగా ఉన్నాయన్నారు.