Research Work
-
కమిషనర్ల బృందం మన్యం పర్యటన
అరకులోయ: ఏజెన్సీ 11 మండలాల్లో 65 వేల ఎకరాల్లో కాఫీ పెంపకం జరుగుతోందని, తద్వారా 65వేల కుటుంబాలు స్థిర ఆదాయం పొందుతున్నాయని గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. కాఫీబోర్డు, ఎన్ఆర్ఈజీఎస్, ఐటీడీఏ ద్వారా సాగు చేపడుతున్నామన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో శుక్రవారం పలు రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్లు కాఫీ తోటలు, చెరువులను పరిశీలించారు. కమిషనర్ల బృందానికి పాడేరు ఐటీడీఏ ఇన్చార్జీ పీవో శివశంకర్, డ్వామా పీడీ కళ్యాణ్ చక్రవర్తి గిరిజన సంప్రదాయ థింసా నృత్యాలతో సుంకరమెట్ట పంచాయతీ గేటు వలస గ్రామంలో ఘన స్వాగతం పలికారు. పెదలగంగగ్గుడిలోని గిరిరైతుల కాఫీ తోటలు, గద్యగుడ గ్రామంలోని చెరువు, యూత్ ట్రయినింగ్ సెంటర్లో(వైటీసీ) నిర్మించిన రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ను కమిషనర్లు పరిశీలించారు. రామాంజనేయులు మాట్లాడుతూ భూగర్భజలాలు పెంపొందించేందుకు గత ఏడాది రూ. 2వేల కోట్లు కేటాయించామన్నారు. ఈ ఏడాది ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ. 1754 కోట్లు, ఇతర శాఖ ద్వారా రూ. రూ. 1754 కోట్లు కేటాయించి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యటనలో 10 రాష్ట్రాల గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్లు, డ్వామా సిబ్బంది, ఇంజినీరింగ్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అరకులోయ సీఐ సింహాద్రినాయుడు పర్యవేక్షణలో ఎస్ఐ సింహాచలం బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపాధి కూలీలతో మాటామంతి అనంతగిరి: మండలంలో టోకూరు పంచాయతీ కేంద్రంలో ఉపాధి హామీ కూలీలతో ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర బృందం ముచ్చటించింది. అరకు పర్యటన అనంతరం వారు టోకూరు చేరుకున్నారు. గ్రామంలో ఉపాధి హామీ పథకంలో మరుగుదొడ్లు నిర్మించుకున్నామని గ్రామస్తులు బృంద సభ్యులకు తెలిపారు. ఉపాధి పనులతో ఆర్థికంగా వృద్ధి చెందామన్నారు. వారంతా గ్రామస్తులు నిర్మించుకున్న మరుగుదొడ్లు పరిశీలించారు. కార్యక్రమంలో బృంద సభ్యులు సునిల్ పటేల్, రగురాజ్ రాహుల్, ఎంపీడీవో రమేష్రామన్, ఏపీవో రమణతల్లి తదితరులు పాల్గొన్నారు. బొర్రా అందాలు అద్భుతం బొర్రా గుహలను 10 రాష్ట్రాలకు చెందిన కమిషనర్ల బృందం శుక్రవారం సందర్శించింది. గుహల విశిష్టతను బృంద సభ్యులకు గైడ్లు వివరించారు. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలను చూసి వారు అద్భుతంగా ఉన్నాయన్నారు. -
నేను క్యాస్టిస్టును కాదు..
♦ నాపై ఎలాంటి మరకలు లేవు: హెచ్సీయూ ఇన్చార్జి వీసీ శ్రీవాస్తవ ♦ నేటి నుంచి రీసెర్చ్ వర్క్, రేపటి నుంచి తరగతులు హెచ్సీయూలో రోహిత్తోపాటు నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన కమిటీకి తానే అధ్యక్షుడినని.. అయినా తాను క్యాస్టిస్టును కాదని, తనపై ఎటువంటి మరకలూ లేవని ఇన్చార్జి వీసీ విపిన్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. హెచ్సీయూలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో హెచ్సీయూ కెమిస్ట్రీ డీన్ దుర్గాప్రసాద్, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఎం.సుధాకర్, మెడికల్ సెన్సైస్ డీన్ వేముగంటి గీతలతో కలసి శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు. హెచ్సీయూలో తరగతులు ప్రారంభించేందుకు జేఏసీ నుంచి సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే ఇంత వరకు వారి నుంచి స్పష్టమైన అంగీకారమేమీ అందలేదన్నారు. రోహిత్తో పాటు మరో నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసిన కమిటీకి తానే అధ్యక్షుడినని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2008లో తమిళనాడుకి చెందిన సెంథిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో తాను డీన్గా ఉన్నానని చెప్పారు. కానీ ఆ ఘటనకు సంబంధించి తనపై ఎటువంటి మరకలు లేవని, కమిటీలు క్లీన్చిట్ ఇచ్చాయన్నారు. అసలు హెచ్సీయూలో కుల వివక్ష ఉందా, లేదా అని విలేకరులు ప్రశ్నించగా... తాను 36 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నాననీ, తనకు అటువంటిదేమీ కనిపించలేదని పేర్కొన్నారు. తాను క్యాస్టిస్టును కాదని, తనపై ఎటువంటి మరకలూ లేవని చెప్పారు. అయితే గతంలో జరిగిన ఆత్మహత్యలపై చర్చ జరగాల్సి ఉందని, అధ్యాపకులను సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థులకు, అధ్యాపకులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్నారు. కేవలం హెచ్సీయూలోనే కాదని దేశవ్యాప్తంగా వర్సిటీల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే దళితులే ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నించగా... అందుకు అనేక కారణాలుంటాయంటూ దాటవేశారు. విద్యార్థుల డిమాండ్ల పరిష్కారం తమ పరిధిలో లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు, 50 లక్షల ఎక్స్గ్రేషియా వంటివేవీ యూనివర్సిటీ చేతిలో లేవని చెప్పారు. సస్పెన్షన్ ఎత్తివేసే అంశం హైకోర్టు పరిధిలో ఉందన్నారు. మొత్తం పదకొండు మంది డీన్లు విద్యార్థులతో చర్చించారని, తరగతులు ప్రారంభించేందుకు వారు అంగీకరించారని శ్రీవాస్తవ చెప్పారు. అయితే అలా హామీ ఇచ్చిన విద్యార్థి నేతలెవరో చెప్పాలని కోరగా... ఇంకా నిర్దిష్టమైన హామీ ఏమీ రాలేదని తెలిపారు.