రెండేళ్లుగా రాష్ట్రంలో చేసిందేమీ లేక అధికార పార్టీ నాయకులు, సీఎం చంద్రబాబు, మంత్రులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని......
► మోసగించిన ప్రజలకు ఏం సమాధానం చెబుతారు
► రెండేళ్లలో సాధించిందేమిటో ప్రజలకు చెప్పాలి
► ఎమ్మెల్యే పీఆర్కే
మాచర్ల: రెండేళ్లుగా రాష్ట్రంలో చేసిందేమీ లేక అధికార పార్టీ నాయకులు, సీఎం చంద్రబాబు, మంత్రులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సమయంలో ప్రభుత్వ మోసగింపు తీరు గురించి మాట్లాడుతూ హామీలను అమలుచేయకపోతే చెప్పులతో ప్రజలు కొడతారని ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడారన్నారు. నవనిర్మాణ దీక్ష పేరుతో కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసి సభలు, కార్యక్రమాలు నిర్వహించిన సీఎం చంద్రబాబు, మంత్రులు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకోలేక ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన సభల్లో జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
ఎవరైనా తాము చేసిన పనుల గురించి చెప్పుకునేందుకు సభలు నిర్వహిస్తారన్నారు. అందుకు విరుద్ధంగా ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేక జగన్.. జగన్ అంటూ ఆయన పై రోజూ విమర్శల దాడి చేసేందుకే మంత్రులు సమయాన్ని కేటాయిస్తున్నారన్నారు. సీఎం మొప్పు కోసం ఒకరిని మించి ఒకరు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి నీతిమాలిన రాజకీయాలు చేసిన పార్టీ ఏదీ లేదని, ఆ ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.
ఎల్లకాలం మీడియాను అడ్డం పెట్టుకొని విమర్శలు చేసినంత మాత్రాన ప్రజల ఆదరణ లభించదనే విషయాన్ని టీడీపీ నాయకులు గమనించాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయటం మినహా ప్రజల ఆశలను నెరవేర్చకుండా మరింత మోసపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై దశలవారీగా ఉద్యమాలు చేసి ప్రజల ద్వారా టీడీపీకి బుద్ధిచెప్పటానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పీఆర్కే కోరారు.