Sakshi News home page

ఘరానా మోసగాడి అరెస్ట్‌

Published Sun, Mar 5 2017 1:28 AM

ఘరానా మోసగాడి అరెస్ట్‌ - Sakshi

ఏలూరు అర్బన్‌ : పోలీస్, విజిలెన్స్‌, ఏసీబీ అధికారినంటూ రేషన్‌ డీలర్లు లక్ష్యంగా నేరాలకు పాల్పడిన ఘరానా మోసగాడిని గణపవరం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ వలిశెల రత్న వివరాలు వెల్లడిం చారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన అయితం రవిశేఖర్‌ అనే వ్యక్తి విలాసాలకు బానిసై మోసగాడికి మారాడు. తాను పోలీస్, విజిలెన్స్‌, ఏసీబీ అధికారినంటూ ప్రజ లకు పరిచయం చేసుకోవడంతో పాటు దొంగిలించిన కార్లకు ప్రభుత్వ నంబర్‌ ప్లేట్లను అమర్చుకుని వాటిపై ప్రభుత్వ వాహనం అని రాయించుకుని తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి తాను విజిలెన్స్‌ అధికారినంటూ హ డావుడి చేసేవాడు. కేసు లేకుండా చేస్తానని డీలర్లను నమ్మించి వారి వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కాజేసేవాడు. ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి సొమ్ములు వసూలు చేసుకుని పరారయ్యేవాడు. నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో అలపాటి రాజ్యలక్ష్మి అనే రేషన్‌ షాపు డీలర్‌ భార్యను మోసగించి 25 కాసుల బంగారు ఆభరణాలు, ఉంగుటూరుకు చెందిన పారంపాటి రాఘవేంద్రరావును ఏసీబీ అధికారినంటూ మోసగించి స్విఫ్ట్‌ డిజైర్‌ కారును అపహరించుకుపోయాడు. ఇలా ఇప్పటి వరకూ 80కు పైగా నేరాలకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు శిక్ష కూడా అనుభవించాడు. చివరిగా నల్గొండ జిల్లా భువనగిరిలో మోసానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవించి గతేడాది విడుదలయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 11 నేరాలకు పాల్ప డ్డాడు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, సీసీఎస్‌ డీఎస్పీ టి.సత్యనారాయణ పర్యవేక్షణలో సీసీఎస్‌ పోలీసులు, గణపవరం పోలీసు సిబ్బంది నిందితుడిని బాదంపూడి వై.జంక్షన్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 341 గ్రాముల బంగారు ఆభరణాలు, నకిలీ ఐడెంటిటీ కార్డులు, నకిలీ కార్‌ నంబర్‌ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ రత్న వివరించారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, గణపవరం సీఐ దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement