లిఫ్ట్ల ద్వారా ప్రాజెక్టులా?
లిఫ్ట్ల ద్వారా ప్రాజెక్టులు నిర్మించిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన అర్గుల్లో విలేకరులతో మాట్లాడారు.
ప్రపంచంలో ఎక్కడా లేని వింత..
రైతులను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం
శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ
జక్రాన్పల్లి : లిఫ్ట్ల ద్వారా ప్రాజెక్టులు నిర్మించిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన అర్గుల్లో విలేకరులతో మాట్లాడారు. గుత్ప ద్వారా జక్రాన్పల్లి మండలానికి సాగు నీరందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే జీవో జారీ చేసిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో సీఎం కే సీఆర్ లక్ష కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. 14 గ్రామాలను ముంచేసి లిఫ్ట్ల ద్వారా మల్లన్నసాగర్ కడతామంటే ఊరుకునేది లేదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ (డిటేయిల్ ప్రాజెక్టు రిపోర్టు) బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
గోదావరి నీళ్లు తెస్తామని అరచేతిలో వైకుంఠం చూపి రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఏ విధంగా నిజాంసాగర్కు నీళ్లు తెస్తారో వివరించాలన్నారు. రెండేళ్ల కాలంలో జిల్లాలో ఎక్కడా ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ల పాలనలో రాష్ట్రంలో రూ. 60 వేల కోట్ల అప్పులు ఉంటే రెండేళ్ల టీఆర్ఎస్ పాలనలో రూ. 60 వేల కోట్లు అప్పులు చేశారన్నారు. కామారెడ్డి పథకం ద్వారా కామారెడ్డి నియోజకవర్గంలోని 211 గ్రామాలకు నీళ్లు అందించామని, ప్రధాని మోడీ రాష్టానికి వచ్చి 21 గ్రామాలకే నీళ్లు అందించే ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్,ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోర్త రాజేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్యాదవ్, పార్టీ రాష్ట్ర నాయకుడు ఏబీ చిన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీశ్ తదితరులు పాల్గొన్నారు.